సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 17: జిల్లాలో ఈ నెల 19న ప్రారంభం కానున్న కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ రాజర్షితో కలిసి కంటివెలుగు శిబిరాల నిర్వహణపై మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు, పంచాయతీరాజ్, పోలీసు, వైద్యాధికారులతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సున్నిత కార్యక్రమం కంటివెలుగు అని పేర్కొన్నారు.
ఈ నెల 19న ఉదయం 9 గంటలకు కచ్చితంగా కంటివెలుగు శిబిరం ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. జిల్లాలో 69 బృందాల ద్వారా కంటివెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైన సామగ్రి అందుబాటులో ఉన్నదని, జిల్లాకు ఇప్పటివరకు 64,900 రీడింగ్ గ్లాసులు వచ్చాయని చెప్పారు. ట్యాబులను సాఫ్ట్వేర్తో సిద్ధం చేస్తామని తెలిపారు. సూక్ష్మ ప్రణాళిక అందరికీ పంపిస్తామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 854 శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు గురువారం నుంచి అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. కంటివెలుగు బృందాలకు శిక్షణ పూర్తయిందన్నారు. ప్రతి క్యాంపును ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
గ్రామాల్లో 300, పట్టణాల్లో 400 మందికి వైద్య పరీక్షలు…
ప్రతిరోజూ గ్రామ స్థాయిలో 300 మంది, పట్టణాల్లో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా పక్కా ప్రణాళికతో ముందికెళ్లాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు పని చేస్తాయని వివరించారు. ప్రత్యేక అధికారులు కేంద్రాలను ముందుగా తనిఖీ చేసి నివేదికలు అందజేయాలన్నారు. కంటివెలుగు బృందానికి రాత్రి బస చేసేందుకు వసతి, నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు…
జిల్లాలో కంటివెలుగుకు సంబంధించి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్నా 9494851165 నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. ప్రజలకు 100 శాతం మొబిలైజేషన్ చేసేలా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఉన్న ఎంపీవో, ఎంపీడీవో, తహసీల్దార్, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రతిరోజూ వారి పరిధిలోని క్యాంపులను తనిఖీ చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో డీఎంహెచ్వో, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలన్నారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కన్నా ముందుగా అన్ని పంచాయతీల్లో సంబంధిత ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి షెడ్యూల్ వివరాలను తెలియజేస్తూ కంటివెలుగుపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. క్యాంపునకు ముందు మూడు రోజుల నుంచి చాటింపు వేయించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాలో కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరోసారి స్పష్టం చేశారు. ఏ రోజు లక్ష్యం ఆ రోజు పూర్తయ్యేలా చూడాలన్నారు.
క్యాంపుల వద్ద పటిష్ట భద్రత
ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత చేపట్టాలన్నారు. ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎస్హెచ్వోలకు అందజేయాలన్నారు. ఎస్హెచ్వోలు రెగ్యులర్గా కార్యక్రమాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు ఉన్నా తెలియజేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కంటి స్క్రీనింగ్ కోసం ప్రజలు ఒకేసారి కాకుండా వారికి ఇచ్చిన టైమ్ మేరకు వచ్చేలా పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీలు చూసుకోవాలని ఎస్పీ కోరారు. అందరి సమన్వయంతో కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు.