రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి రోజు పరీక్షలు చేయించుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.
వైద్యులు ప్రతి ఒక్కరికీ ఉచితంగా టెస్ట్లు చేశారు. కలెక్టర్లు, జడ్పీచైర్పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కార్యక్రమాలకు హాజరై ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు మందులు, కళ్లద్దాలు అందజేశారు. మెదక్ జిల్లాలో 3508 మందికి, సంగారెడ్డి జిల్లాలో 11102 మందికి పరీక్షలు నిర్వహించారు. తమ ఇబ్బందులను తెలుసుకుని ఊరికే బృందాలను పంపి వైద్యసాయం చేయిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ జిల్లా కేంద్రం గాంధీనగర్ కాలనీలో మహిళకు కళ్లజోడును తొడుగుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలో రెండో విడత కంటి వెలుగు గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమం నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు కంటి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేసి కండ్ల అద్దాలను పంపిణీ చేశారు. అత్యవసరమైన వారికి శస్త్రచికిత్సల కోసం సిఫారసు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 40 బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకో బృందంలో వైద్యాధికారి, అప్తమెట్రిస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్రతి బృందానికి రెండు ట్యాబ్లు, సిమ్కార్డులు, అవసరమైన అన్ని పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు..
జిల్లా కేంద్రంలోని 22 వ వార్డు కమ్యూనిటీ హాల్లో, హవేళీఘణపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో రెండో విడత కంటివెలుగును మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో జడ్పీచైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ ప్రారంభించారు. పెద్దశంకరంపేట్లో ఎంపీ బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిలు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి, నర్సాపూర్లలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. చేగుంట మండలం పోతంశెట్టిపల్లిలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. నర్సాపూర్ మండలం తిరుమలాపూర్, ఎల్లారెడ్డిపల్లి తండాలో కలెక్టర్ ఎస్.హరీశ్ పర్యవేక్షించారు. గడిపెద్దపూర్ గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. అనంతరం పాపన్నపేట్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
40 గ్రామాల్లో… 40 శిబిరాలు..
మెదక్ జిల్లాలో 40 గ్రామాల్లో 40 శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొదటిరోజు 3508 మందికి పరీక్షలు నిర్వహించగా, 463 మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ తెలిపారు. వంద రోజుల ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, కంటి వెలుగు శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు.
కండ్లు కనబడనోళ్లకు సూత్తుండ్రు..
ఇదివరకు పవేటల ఎడమ కన్ను సూయించుకుని ఆపరేషన్ చేయించుకున్న. ఇప్పుడు ఈడ సర్కారోళ్లు సూత్తండ్రని సెప్పిండ్రు. ఇవ్వాల రమ్మని నంబరు ఇచ్చిండ్రు. ఈడికివచ్చి సూయించుకునేందుకు వచ్చిన. కుడి కన్ను మంచిగ కనబడతలేదు. మసక మసక కనబడుతాంది. పైసలు లేకుండా సర్కారోళ్లు సూసి కండ్ల అద్దాలు కూడ ఇత్తరని చెప్పిండు. – తిప్పట్ల లస్మవ్వ, హుస్నాబాద్
సీఎం కేసీఆర్ సార్ మాపాలిట దేవుడు
నేను మగ్గం నేస్తుంటా.. కొన్ని సంవత్సరాలుగా కంటి సమస్యతో బాధపడుతున్న. 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వ దవాఖానలతో ఎడమ కన్నుకు ఆపరేషన్ జరిగింది. కండ్లు మసక మసకగా కనబడుతున్నయి. ఈరోజు కంటి పరీక్ష చేయించుకున్న కంటి ఆద్దాలు ఇచ్చిండ్రు. చాలా సంబురంగా ఉంది. ఆద్దాలు బాగా కనబడుతున్నయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సార్లకు రుణ పడిఉంటాం.
– లక్ష్మీనారాయణ, నీలకంఠనగర్, 7వ వార్డు, సిద్దిపేట
కంటి పరీక్ష చేయించుకున్నా…
నేను బీడీలు చూడుతూ జీవనం సాగిస్తున్న. నేను గత 3 సంవత్సరాల నుంచి దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న. కంటి వెలుగు శిబిరంలో ఈరోజు పరీక్ష చేశారు. తగ్గిపోతుందని నాకు కంటి ఆద్దాలు అందజేశారు. నాకంటి సమస్య త్వరలోనే తగ్గి పోతుందని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సార్లకు కృతజ్ఞతలు.
సంగారెడ్డి జిల్లాలో 11,102 మందికి పరీక్షలు
2929 మందికి కళ్ల అద్దాలు పంపిణీ
1770 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు ఆర్డర్
2628 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తింపు
కంటి పరీక్షల నిర్వహణపై సర్వత్రా హర్షం
సంగారెడ్డి జనవరి 19(నమస్తే తెలంగాణ): జిల్లాలో తొలిరోజు 11,102 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. గురువారం ఉదయం 9గంటల నుంచి కంటివెలుగు వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. సదాశివపేట మండలం ఆత్మకూరు పీహెచ్సీలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు కంటి పరీక్షలు చేయించుకున్నవారితో మాటాడి కళ్ల అద్దాలు అందజేశారు. నిజాంపేటలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కంటివెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చాంద్ఖాన్పల్లి, తుర్కపల్లి, సిర్గాపూర్, కల్హేర్ మండలం ఖానాపూర్(కె)లో కంటివెలుగు కేంద్రాలను ప్రారంభించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పట్ణణంలోని లయన్స్క్లబ్, అమీన్పూర్, రామచంద్రాపురంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణం మాణిక్ ప్రభు వీధి, గడీ మహల్లా, హోతి(డి) గ్రామాల్లో ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు.
69 వైద్య శిబిరాల ద్వారా 11,102 మందికి పరీక్షలు
సంగారెడ్డి జిల్లాలో తొలిరోజు 69 కంటివెలుగు వైద్య శిబిరాలను నిర్వహించగా, 69 బృందాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు జిల్లాలో 11,102 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 5150 మంది పురుషులు, 5952 మంది మహిళలు ఉన్నారు. 2919 మందికి రీడింగ్ గ్లాసెస్ అప్పటికప్పుడు అందజేశారు. కంటి సమస్యలు ఉన్న 1770 మంది కోసం ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. 2628 మంది శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. వీరిని ప్రభుత్వ దవాఖానల్లో ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. శిబిరాలకు వచ్చే వారి కోసం కేంద్రాల వద్ద టెం ట్లు, కుర్చీలు వేయటంతో పాటు తాగునీటి సౌక ర్యం కల్పించారు. కంటిపరీక్షలు చేయించుకుని అద్దాలు అవసరంలేని వారికి వైద్యులు మందు లు అందజేశారు. ఆత్మకూరు, సదాశివపేట, చిట్కుల్, రుద్రారంలోని కేంద్రాలను డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవితో కలిసి కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజిర్షిషా పరిశీలించారు.