సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 21: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 100 శాతం ప్రసవాలు జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, పంచాయతీ, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. హెల్త్ ఇండికేటర్స్, ఆరోగ్య మహిళా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్స్ పంపిణీ, ఏఎంసీ నమోదు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 90 శాతం ప్రసవాలు జరుగుతున్నాయన్నాయన్నారు. అందుకు వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. జిలాలోని 232 సబ్ సెంటర్లకు గాను 174 సబ్ సెంటర్లలో 100 శాతం ప్రసవాలు జరిగాయన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో 100 శాతం ప్రసవాలు జరిగేలా ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మెడికల్ అధికారులు, ఆయా సిబ్బంది దృష్టి సారించాలన్నారు. హెల్త్ ఇండికేటర్స్కు సంబంధించి అన్ని పారామీటర్లలో బాగున్నదని కలెక్టర్ కితాబిచ్చారు. కేసీఆర్ కిట్స్ పంపిణీ 100 శాతం పూర్తి కావాలన్నారు.
ఏఎంసీ రిజిస్టర్లో విధిగా నమోదు కావాలని, ఏఎంసీ చెకప్ 100 శాతం విధిగా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వారం అంగన్వాడీ డే నిర్వహించాలని, ఆ రోజు ఆయా అంశాలపై సమీక్ష జరగాలని సూచించారు. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. పోషణ లోపం గల పిల్లల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, ఆ కేందాలను వినియోగించుకునేలా మహిళలను చైతన్యం చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో 100 నుంచి 125 మంది మహిళలకు స్క్రీనింగ్ జరగాలన్నారు. రిఫరల్ కేసులను ఆయా మెడికల్ ఆఫీసర్లు ఫాలోఅప్ చేయాలన్నారు.
సజావుగా కంటి వెలుగు
జిల్లాలో కొనసాగుతున్న కంటి వెలుకు కార్యక్రమం సజావుగా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కంటి వెలుగు శిబిరాల్లో ప్రతి బృందం సరాసరి 200 నుంచి 225 మందికి స్క్రీనింగ్ చేయాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు వచ్చిన వెంటనే పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, డీపీవో సురేశ్ మోహన్, డిప్యూటీ డీఏంహెచ్వోలు, మెడికల్, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.