సంగారెడ్డి, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ‘కమలం’ వాడిపోతున్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కో ముఖ్య నేత బీజేపీని వీడుతుండడం ఆ పార్టీ నేతలు, అధిష్టానాన్ని కలవరపెడుతున్నది. మోదీ చరిష్మాతో ఉమ్మడి జిల్లాలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమాగా ఉన్నది. ఇలాంటి తరుణంలో పార్టీకి ముఖ్యనేతలు రాజీనామా చేస్తూ పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా బీజేపీలో గ్రూపు తగాదాలు పెరుగుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో తాత్సారం చేయటంతో ఎన్నికలకు ముందే పార్టీని వీడాలని బాబూమోహన్ భావించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అధిష్టానం తీరును ఎండగట్టడంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోవడంతో పార్టీలో ఇమడలేక ఇటీవలే బీజీపీకి రాజీనామా చేశారు.
తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోదరుడు రాంచందర్ రాజనర్సింహ కమలంను వీడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన జహీరాబాద్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో వ్యక్తిగత కారణాలతో పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాంచందర్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ తరఫున పోటీచేసిన ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీని వీడటం ఆ పార్టీలో కలకలం రేపుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇద్దరు ముఖ్యనాయకులు బీజేపీని వదలడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందేమోనని అధిష్టానం కలవరపడుతుంది. ఇదిలాఉంటే ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న మరో ఇద్దరు నేతలు సైతం త్వరలో పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తమకు టికెట్ దక్కని పక్షంలో ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
పటాన్చెరు, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని ముఖ్యనాయకులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలే అవకాశం ఉంది. ఓవైపు ముఖ్య నాయకులు పార్టీలోంచి వెళ్తుంటే, మరోవైపు జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డికి పదవి దక్కటంతో అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. గోదావరి అంజిరెడ్డికి మద్దతుగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరోవర్గం నాయకులు పరస్పరం అంతర్గతంగా కుమ్ములాటలకు దిగుతున్నారు. రెండువర్గాలు ఎవరికి వారే పార్టీలో పైచేయి కోసం పోటీపడుతున్నారు. ఎంపీ ఎన్నికలకు ముందు పార్టీలో గ్రూపు తగాదాలు పెరుగుతుండటం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యత రాష్ట్ర స్థాయిలో ముఖ్యనాయకుడికి అప్పగించినట్లు సమాచారం. సదరు నేత త్వరలోనే జిల్లాలోని నాయకులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.