హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అరుదైన రక్త సంబంధిత రుగ్మత ‘ఫ్యాక్టర్-వీ’ లోపంతో బాధపడుతున్న గర్భిణికి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా ప్రసవం జరిపారు. లక్షల్లో ఒకరికి వచ్చే ఈ రుగ్మతతో ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుందని, దీని వల్ల ప్రాణాపాయ పరిస్థితి పొంచి ఉంటుందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే… ఏపీలోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల మహిళ 39 వారాల గర్భంతో జూన్లో రెయిన్బో వైద్యులను సంప్రదించింది. సదరు గర్భిణికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఫ్యాక్టర్-వీ లోపం ఉన్నట్టు గుర్తించారు. అరుదైన, క్లిష్టమైన సమస్య కావడంతో సీనియర్ కన్సల్టెంట్, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ హిమబిందు అన్నమరాజు నేతృత్వంలో క్లినికల్ హెమటాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, అనస్థీషియా నిపుణులతో కూడిన బహుళ విభాగాల బృందం ముందస్తు ప్రణాళికతో చికిత్స చేపట్టింది. పలు విభాగాలకు చెందిన వైద్య బృందం సమన్వయంతో గర్భిణికి విజయవంతంగా ప్రసవం జరిపింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.