సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సర్కారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. కేసీఆర్ భగీరథ ప్రయత్నం, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు నిరంతర కృషితో గోదావరి జలాలు బీడు భూములను సస్యశ్యామలం చేశాయి. రిజర్వాయర్ల నిర్మాణంతో సిద్దిపేట జిల్లాలో పంటల సాగువిస్తీర్ణం పెరిగి రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో సాగు స్వరూపం పూర్తిగా మారిపోయింది. నేడు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులోని ‘మేడిగడ్డ బరాజ్’ పర్యటన నేపథ్యంలో ప్రత్యేక కథనం.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 10లో భాగంగా మిడ్మానేరు నుంచి గోదావరి నీటిని 3.50 టీఎంసీల కెపాసిటీ గల అన్నపూర్ణ రిజర్వాయర్కు తరలిస్తున్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు 30వేల ఎకరాల ఆయకట్టు, సిద్దిపేట జిల్లాకు 15,200 ఎకరాలు సాగులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -11లోఅన్నపూర్ణ నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని కెపాసిటీ 3 టీఎంసీల సామర్థ్యం. ఈ రిజర్వాయర్ నుంచి లక్షా 10 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ను 23 ఫిబ్రవరి, 2022 కొండపోచమ్మ రిజర్వాయర్ను 29 మే, 2020లో మాజీ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద 0.32 టీఎంసీల సామర్థ్యంతో తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్, కొమురవెల్లి మండలం ఐనాపూర్ – తపాస్పల్లి గ్రామాల మధ్య తపాస్పల్లి రిజర్వాయర్ను 0.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. దీని సామర్థ్యం 8.23 టీఎంసీలు. ఇటీవలే ట్రయల్ రన్ సైతం నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్టు ద్వారా గోదావరి జలాలు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నిర్మించింది. ఈ రిజర్వాయర్ల కింద కాల్వలు నిర్మించి చెరువులు, కుంటలు నింపింది. దీంతో మండుటెండల్లోనూ చెరువులు అలుగు పారాయి. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి ట్రయల్న్ నిర్వహించింది. రాష్ట్రంలో అత్యధికంగా రిజర్వాయర్లు సిద్దిపేట జిల్లాలో నిర్మాణమయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్, ఎల్లాయిపల్లి, కొచ్చగుట్టపల్లి గ్రామాల మధ్య అన్నపూర్ణ (అనంతగిరి 3.50 టీఎంసీల సామర్థ్యం) రిజర్వాయర్ను నిర్మించారు. సుమారుగా రూ. 2,700 కోట్లతో చేపట్టారు. కాళేశ్వరం ప్యాకేజీ- 10లో భాగం గా శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి నీటి ని అన్నపూర్ణ రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. ఇల్లంతకుంట మండలం తిప్పారం వద్ద 92 మీటర్ల లోతులో ఆసియాలోనే అతి పెద్ద ఓపెన్ సర్జ్పుల్ పంపు నిర్మించారు. ఒక్కో పంపు 106 మెగా వాట్లతో కలిగినవి నాలుగు, 120 మెగా వాట్ల ట్రాన్స్ఫార్మర్లను నాలుగింటిని బిగించారు. ఈ రిజర్వాయర్తో సిద్దిపేట జిలాలోని చిన్నకోడూరు, బెజ్జంకి మండలాల్లో 15,200 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో 14,000 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలో 800 ఎకరాలకు సాగునీరందుతుంది.
కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కేంద్ర జల సంఘం సూచనల మేరకు వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలకు నీటిసరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు తొగుట మండలం దగ్గర ఈ భారీ రిజర్వాయర్ను ఏర్పాటు చేశారు. ఈ రిజర్వాయర్లో భాగంగా ముంపునకు గురైన గ్రామాల్లోని 5,205 కుటుంబాలకు గజ్వేల్ మండలంలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల్లో 600 ఎకరాల్లో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి ఇండ్లు కేటాయించారు. ఈ రిజర్వాయర్ ను 23 ఫిబ్రవరి, 2022లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. రిజర్వాయర్ మొత్తం పొడవు 22. 600 కి.మీటర్లు. ఈ రిజర్వాయర్ కు 5 ప్రధాన తూములు నిర్మించగా, 16,43,665 ఎకరాలకు నీటి సరఫరా కోసం ప్రతిపాదించడం జరిగినది. దీనిలో 12,18,080 ఎకరాల కొత్త ఆయకట్టుకు ప్యాకేజ్ 12,13,14,15,16,18, 19 ద్వారా నీరు అందించేందుకు ప్రతిపాదించారు. సింగూర్ ప్రాజెక్టు, వనదుర్గ (ఘనపూర్ ఆనకట్ట), నిజాంసాగర్, తపాసుపల్లి రిజర్వాయర్ల కింద 4,25,585 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ – పెద్దకోడూరు గ్రామాల శివారులో రంగనాయక సాగర్ రిజర్వాయర్ను 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11లో భాగంగా నిర్మించిన ఈ రిజర్వాయర్ బండ్ 8.65 కి.మీ పొడవు ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్ (బండ్ ) 1.746 కి.మీ వద్ద స్లూయిస్(తూం)ను ఏర్పాటు చేసి నాలుగు గేట్లను బిగించారు. హెడ్రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ కెనాల్, సొరంగం ద్వారా గోదావరి జలాలు శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్లోకి పంపింగ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ను 24 ఏప్రిల్-2020 లో అప్పటి మంత్రులు తన్నీరు హరీశ్రావు, కె.తారక రామారావు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రంగనాయక సాగర్ ఎడమ కాల్వ ద్వారా 70,000 ఎకరాలు కుడి కాల్వ ద్వారా 40,000 ఎకరాలు ఆయకట్టు ప్రతిపాదించారు. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగనూర్, నారాయణరావుపేట్, చిన్నకొడూరు, బెజ్జంకి మండలాల్లో 51 గ్రామాల్లో 76,931 ఎకరాల ఆయకట్టు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో 33,069 వేల ఎకరాలు ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథలో భాగంగా మంగోలు గ్రామంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించి దాని నుంచి 540 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డి) శుద్ధ తాగు నీటిని 7 జిల్లాల్లోని 10 నియోజకవర్గాలకు సరఫరా చేస్తున్నారు. 270 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ)శుద్ధతాగు నీటి సరఫరా వ్యవస్థను 10 ఏప్రిల్ 2023న అప్పటి మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావులు ప్రారంభించారు. మల్లన్నసాగర్ ద్వారా 10 జిల్లాలు, 24 నియోజకవర్గాలు లబ్ధి పొందుతున్నాయి.
సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టును ఇందిరమ్మ ప్లడ్ ఫ్లో కెనాల్ కింద 2008 -09 సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి నీటిని ఎస్సారెస్పీ ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేరుకు తీసుకువచ్చి అక్కడి నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గౌరవెల్లి లిఫ్ట్ కెనాల్ ద్వారా నింపేలా ప్రణాళిక చేశారు ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు దీని సామర్థ్యం 1.41 టీఎంసీలు మాత్రమే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్లో భాగంగా 2015లో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు, అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్, వినోద్కుమార్లతో కలిసి గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించి 2015లో గౌరవెల్లి సామర్థ్యాన్ని 1.41 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు పెంచారు. లక్షల ఎకరాలకు సాగునీరందించి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసింది. మిడ్మానేరు నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు గౌరవెల్లి రిజర్వాయర్లోకి ట్రయల్ రన్ చేసిన విషయం తెలిసిందే. తోటపల్లి నుంచి నార్లపూర్ వరకు 8 కి.మీటర్ల లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి అక్కడినుంచి గొట్లమిట్ట వరకు 3 కి.మీటర్ల అప్రోచ్ కెనాల్ నుంచి సుమారుగా 12 కి.మీటర్ల మేర సొరంగం ద్వారా రేగొండ పంప్ హౌస్కు గోదావరి జలాలు తరలిస్తారు. రేగొండ వద్ద ఏర్పాటు చేసిన పంపుల ద్వారా నీటిని గౌరవెల్లి రిజర్వాయర్లోకి ఎత్తి పోస్తారు. 32 మెగావాట్ల సామర్థ్యంతో 3 మోటార్లు 126 మీటర్లు ఎత్తిపోసే విధంగా మహాబలి మోటర్లు బిగించారు.
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ వరకు నీటిని అందించి భరోసా కల్పించారు. కొండపోచమ్మ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు, మంజీరా గుండా 90 కి.మీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం గొల్లిలింగాల వద్ద నిజాంసాగర్లో గోదావరి జలాలు కలిశాయి. వర్గల్ మండలం (సంగారెడ్డి కెనాల్ నుంచి)లో వరుసగా 4 పెద్ద చెరువులతో పాటు హల్దీవాగుపైన 32 చెక్డ్యామ్లను నిండాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో 9, మెదక్ జిల్లాలో 23 చెక్డ్యాంలను నింపారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచి 2023 ఆగస్టు వరకు 11 విడతల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రైతుబీమా కింద 16,061 మంది రైతు కుటుంబాలకు రూ. 803.05 కోట్లు వారి ఖాతాల్లో జమచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీళ్లు లేక కరువు కాటకాలకు నిలయంగా ఉన్న పాత మెదక్ జిల్లా కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి నీళ్లతో సస్యశ్యామలమయింది. ఎక్కడో పుట్టిన గోదావరిని జిల్లాకు తీసుకవచ్చి బీడు భూముల్లో పారించడంతో పచ్చని పంట పొలాలతో గత ప్రభుత్వంలో కోనసీమను తలపించింది. పల్లెల్లో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనిపించాయి. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, సాగునీరు, పంటకొనుగోల కేంద్రాలు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు కలిసి వచ్చాయి.
కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ 15టీఎంసీల సామర్థ్యంతో మరుక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించారు. ఈ రిజర్వాయర్ ముంపునకు గురైన గ్రామాలకు చెందిన 1860 నిర్వాసిత కుటుంబాలకు ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించారు. ఈ రిజర్వాయర్ను 29 మే, 2020లో మాజీ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ రిజర్వాయర్ మొత్తం పొడవు 15 కి.మీ . ఈ రిజర్వాయర్కు 4 ప్రధాన తూములు నిర్మించారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 2,85,280 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కింద 5 జిల్లాలు, 10 నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనున్నది. కాల్వల నిర్మాణానికి అవసరమైన 4,636 ఎకరాలకు గాను 4,636 ఎకరాలను సేకరించారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా 2,85,280 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 8 కాల్వల పనులు జరుగుతున్నాయి.
కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలంలో చేబర్తి పెద్దచెరువు వద్ద కుడ్లేరు వాగు ప్రారంభమవుతుంది. ఇదే వాగును కూడవెల్లి వాగుగా పిలుస్తారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలో కూడెల్లి వాగుకు, దాని ఎగువన నిర్మించిన 33 చెక్ డ్యామ్లకు 2020-21 నుంచి 6,308 ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. గజ్వేల్ నియోజకవర్గంలో 9 చెక్ డ్యామ్ల కింద 2,380 ఎకరాల ఆయకట్టు పారుతుంది. ఈ క్రమంలో కూడెల్లి వాగు జీవనదిగా మారి ఎగువ మానేరు డ్యామ్ వరకు నీరు అందించడంతో పాటు దాని కింద 16,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఈ వాగుపై మొత్తం 39 చెక్డ్యామ్లు ఉన్నాయి. కూడవెల్లి వాగుతో గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్, జగదేవ్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి ,దుబ్బాక మండలాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని ఎగువమానేరు వరకు ప్రవహించిచెక్డ్యామ్లను నింపింది.