సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ అర్బన్, జూలై 3: జిల్లాలో పోడు భూముల పట్టాల పంపిణీ గడువులోగా పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంగారెడ్డి కలెక్టర్కు సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో పోడు పట్టాల పంపిణీ, గృహలక్ష్మి, ఎరువులు, విత్తనాల నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, హరితహారం, బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, హౌస్ సైట్స్ పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పోడు పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. పోడు పట్టాల పంపిణీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. లబ్ధిదారులకు రైతుబంధు ప్రయోజనం చేకూర్చేందుకు వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించాలన్నారు.
అందుబాటులో సరిపడా ఎరువులు..
సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని సీఎస్కు వివరించారు. పోడు పట్టాల పంపిణీకి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ వారంలోగా పంపిణీ పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా హౌస్ సైట్స్కు సంబంధించి లేఅవుట్స్ అయిపోయాయని, జిల్లాస్థాయి అప్రూవల్, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందన్నారు. ఈ నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేస్తామన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ ప్రక్రియ మొదలైందని కలెక్టర్ వెల్లడించారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి సంబంధించి జిల్లాలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఫిజికల్గా పూర్తయిందన్నారు. ఆన్లైన్ వెరిఫికేషన్ 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులున్నారు. మెదక్ నుంచి పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ హరితహారంలో భాగంగా 36లక్షల మొక్కలు లక్ష్యమని, శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.