సంగారెడ్డి, జూలై 20(నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెరపిలేకుండా కురుస్తుండటంతో జిల్లా తడిసిముద్ద అవుతున్నది. గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రోజంతా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండడంతో పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరుతున్నది. చెరువులు జలకళ ను సంతరించుకున్నాయి. నారాయణఖేడ్, సంగారెడ్డిలోని పలు చెరువులు అలుగు పారుతున్నాయి. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి వరద చేరుతున్నది. వర్షాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు వందశాతం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ కంట్రోల్ రూమ్తోపాటు 285 ర్యాపిడ్ యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేశాయి. వర్షాలతో ఎవరైనా అనారోగ్యంపాలైతే వెంటనే చికిత్స అందజేసేలా వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటుంది. వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవు ప్రకటించింది.
అందోల్లో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల
సంగారెడ్డి జిల్లాలో గురువారం 34.3 సెం.మీటర్ల వర్షం నమోదైంది. సాధారణ వర్షం కంటే 44.8 శాతం అధికంగా వర్షం కురిసింది. జిల్లాలోని 8 మండలాల్లో అత్యధిక వర్షపా తం నమోదైంది. 14 మండలాల్లో 59 శాతం, 5 మండలాల్లో 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అందోల్లో అత్యధికంగా 10.8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. చౌటకూరు మండలంలో 10.4, పుల్కల్లో 9.6, హత్నూరలో 8.7, గుమ్మడిదలో 7.9, జిన్నారంలో 7.8, మొగుడంపల్లిలో 7.4, జహీరాబాద్లో 7.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కోహీర్, ఝరాసంగం, వట్పల్లి, సదాశివపేట, అమీన్పూర్ మండలా ల్లో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మిగితా మండలాల్లో 3 నుంచి 5 సెం.మీ వర్షం కురిసింది. కంగ్టి మండలంలో రెండు ఇండ్లు కూలిపోయాయి. సింగూరు ప్రాజెక్టు, చెరువుల కింద రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు.
సింగూరులోకి కొనసాగుతున్న వరద
సింగూరు ప్రాజెక్టులోకి గురువారం 8625 క్యూసెక్కుల వరద జలాలు చేరడంతో నీటిమట్టం 19.342 టీఎంసీలకు చేరుకుంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో సింగూరులోకి వరద పెరుగుతోంది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులోకి 870 క్యూసెక్కుల వరద చేరింది. నల్లవాగులో ప్రస్తుతం 458.478 ఎంసీఎఫ్టీల జలాలు ఉన్నాయి.
వర్షాలతో చెరువులకు జలకళ
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. జిల్లాకేంద్రం సంగారెడ్డిలోని మహబూబ్సాగర్ చెరువుతో సహా పలు చెరువులు మ త్తడి దుంకుతున్నాయి. జిల్లాలో 1374 చెరువులు ఉండగా, పది చెరువులు నిండాయి. ఐదు చెరువులు అలుగు పారుతున్నాయి. 451చెరువులు 75శాతం, 652 చెరువులు 50శాతం నిండాయి. వచ్చే రెండు, మూడు రోజులు వర్షం కురిస్తే జిల్లాలోని చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది. సదాశివపేట మండలంలోని గంగకత్వవాగు అలుగు పారుతోంది. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని పలు వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. కోహీర్ మండలంలోని గొటిగార్పల్లి పెద్దవాగు అలుగు పారుతున్నది.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
సంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం సమావేశంలో అన్ని శాఖల అదికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడితే వెంటనే స్పందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసింది. మంత్రి హరీశ్రావు ఆదేశాలతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గాయత్రీదేవి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో వైద్యసేవలు అందించేందుకు 285 రాపిడ్ యా క్షన్ టీమ్లను ఏర్పాటు చేశారు. డీఎంహెచ్వో కార్యాలయం లో కంట్రోల్రూమ్(9494851165) ఏర్పాటు చేశారు. సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్ పట్టణాల్లో తక్షణ అవస రాలకు కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు.