మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్ 10 : తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రైతులు తెల్లముఖాలు వేసుకునే విధంగా మారింది. కొన్నేండ్లుగా పత్తి పంట సాగు ద్వారా లాభపడుతున్న రైతుకు ఈ ఏడాది నష్టాలు మిగిల్చింది. ఉమ్మడి మద్దూరు మండలంలో ఈ ఏడాది వర్షాకాలంలో 7650 ఎకరాల్లో రైతులు పత్తిపంట సాగు చేశారు. పంట సాగు సమయంలో ఆశాజనకంగా ఉన్న వర్షాలు మధ్యలో ముఖం చాటేశాయి. దీంతో పత్తి పంట ఆశించిన స్థాయిలో ఎదగలేదు. గతంలో కంటే ఈ ఏడాది పత్తి పంట దిగుబడి సగానికిపైగా పడిపోయింది. దీనికితోడు పత్తిపంట సాగుకు పెట్టుబడి ఎక్కువైంది. అరకొరగా పండిన పత్తిని అమ్ముకుందామంటే మార్కెట్లో సరైన ధర లేక రైతులు నిరాశ చెందుతున్నారు. గతేడాది బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ. 10వేలకు పైగా ధర పలకగా ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.6వేలలోపే ఉంది. సీసీఐలో క్వింటాల్కు రూ. 7020 మద్దతు ధర ఉన్నప్పటికీ నింబంధనల ప్రకారం రైతులు పత్తిని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమిలేక బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని నష్టపోతున్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన విధంగా అసలే ధరలేక ఇబ్బందులు పడుతున్న పత్తి రైతులపై మిగ్జాం తుఫాన్ ప్రభావం పడింది. ఇటీవల కురిసిన వర్షాలు శాపంగా మారాయి. వర్షానికి పత్తి పంట పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులు పంట చేతికందే సమయంలో వర్షానికి నష్టం జరిగింది.