మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 29: రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లులేక ఎండిపోతున్నాయి. ప్రాణం లెక్కన కాపాడుకుంటూ వచ్చిన పంట పశువుల పాలవుతుంటే గుండెలవిసేలా రైతులు రోదిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో 9750 ఎకరాల్లో వరి, 538 ఎకరాల్లో మొక్కజొన్న, ధూళిమిట్ట మండలంలో 9300 ఎకరాల్లో వరి, 503 ఎకరాల్లో మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేశారు.
రెండు మండలాల్లో రైతులు బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. గత పదేండ్లుగా బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండ డం వల్ల సాగువిస్తీర్ణం పెరగడంతో పాటు పంటలు సమృద్ధిగా పండాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నీళ్లు లేక పంట పొలాలు నెర్రలుపారుతున్నాయి. దీనికితోడు నాణ్యమైన కరెంట్ సరఫరా కాకపోవడంతో తరు చూ ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతుండటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. మద్దూరు మండలంలో లద్నూర్ రిజర్వాయర్ ఉన్నప్పటికీ కాల్వల ద్వారా చెరువు, కుంటలు నింపాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో లద్నూర్ రిజర్వాయర్ నుంచి గాగిళ్లాపూర్, మర్మాముల, ధర్మారం, మద్దూరు, రేబర్తి, వల్లంపట్ల చెరువులు నింపారు. రంగనాయకసాగర్ ద్వారా జాలపల్లి, ధూళిమిట్ట, లింగాపూర్ చెరువు, కుంటలు నింపారు. తరిగొప్పుల చెరువుమీదుగా కూటిగల్ నల్లచెరువును గోదావరి జలాలతో నింపారు. ప్రస్తుతం ప్రభు త్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకోవటానికి రైతులు అప్పులు చేసి బోరుబావులు తవ్వుతున్నా చుక్క నీరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని చెరువు, కుంటలను గోదావరి జలాలతో నింపి ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిపోయిన పంటలను సర్వే చేసి రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలి. ఓ వైపు పంటలు ఎండి పోయి రైతులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వ పెద్దలు క్రీడల్లో మునిగిపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
– మంద యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ధూళిమిట్ట, సిద్దిపేట జిల్లా