జహీరాబాద్, జూలై 1: ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.12.05 కోట్లు పెం డింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన్న ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీని కలెక్టర్ శరత్, జహీరాబా ద్ ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్తో కలిసి పరిశీలించారు. ఫ్యాక్టరీకి ఉన్న భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలని కలెక్టర్, జహీరాబాద్ తహసీల్దార్ జే.స్వామికి ఆదేశించారు. ఫ్యాక్టరీలో ఎంత మొలాసిస్ ఉంది, బ్రౌన్ చక్కెర ఎంత ఉన్నదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్లో ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు రూ.12.05 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని, జూన్ 25 లోగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో ట్రైడెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వేలం వేసి చెరుకు రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ పరిధిలో ఎంత భూమి ఉంది, ఎలాంటి యంత్రాలు ఉన్నాయో పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. చెరుకు రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం మాయమాటలు చెప్పి, చెరుకు తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర షుగర్స్ కేన్ కమిషనర్ ఆదేశాల మేరకు రెవెనూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తులు వేలం వేసి రైతులు, ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇప్పటికే నోటీసు జారీ చేశామన్నారు. నెల రోజుల్లో మిగతా నాలుగు నోటీసులు జారీ చేసి ఆస్తులు వేలం వేసి రైతులకు బకాయిలు చెల్లిస్తామన్నారు. ట్రైడెంట్ ఫ్యాక్టరీకి 50 ఎకరాల భూమి, 35 కోట్లు యంత్రాలు ఉన్నాయన్నారు. ఫ్యాక్టరీని పరిశీలించిన వారిలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, సంగారెడ్డి చెరకు అభివృద్ధి అధికారి రాజశేఖర్, ఆర్డీవో వెంకట్రెడ్డి, డీఎస్పీ వి.రఘు, తహసీల్దార్ జే.స్వామి, కొత్తూర్ సర్పంచు జగన్మోహన్, ఉద్యోగులు ఉన్నారు.
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి: జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
చెరుకు రైతులకు పెండిం గ్ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర షుగర్స్ కేన్ కమిషనర్ వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని జహీరాబాద్ ఎమ్మె ల్యే మాణిక్రావు తెలిపా రు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని పరిశీలించినట్లు తెలిపారు. చెరుకు రైతులు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించనున్నదన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సమస్యలు వచ్చాయన్నారు.