పాపన్నపేట, ఫిబ్రవరి 22: మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో సుమారు 40 కిలోమీటర్ల మేర మంజీరా నది ప్రవహిస్తుంది. ఈ నది పొడవునా ఇసుక లభ్యమవుతుంది. కొంతమంది ఇసుక దందా చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. అయినా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పాపన్నపేట మండలంలోని గాజులగూడెం, చిత్రియాల్, ఎంకెపల్లి గ్రామా ల్లో మంజీరా నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక ఒడ్డుకు చేర్చి, రాత్రిపూట తరలించి విక్రయిస్తున్నారు. గాజులగూడెం గ్రామానికి చెందిన ఒక నాయకుడు పెద్దఎత్తున ఇసుక అక్రమ అమ్మకం చేస్తున్నాడు.
అధికార పార్టీ నాయకుడు కావడంతో అటువైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి వందలాది గాడిదలను గాజులగూడెం, చిత్రియాల్, ఎంకెపల్లి గ్రామాలకు తెప్పించారు. మంజీరా నది నుంచి తవ్విన ఇసుకను గాడిదలపై ఒడ్డుకు చేర్చుతున్నారు. ట్రాక్టర్ ఇసుక తెచ్చినందుకు గాడిదలకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తున్నారు. పలుచోట్ల ఇసుక డంపులు ఏర్పాటు చేసి, చీకటి పడగానే ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు విక్రయిస్తున్నారు.
నిబంధనలకు పాతర..
వాల్టా చట్టం ప్రకారం మంజీరా నది నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీయడం నిషేధం. అయినప్పటికీ పగలూరాత్రీ తేడాలేకుండా మంజీరా నదీ గర్భం నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఒక ట్రాక్టర్ ఇసుక తీస్తే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. కానీ, అక్రమార్కులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మంజీరా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి సాగునీటిని విడుదల చేయలేదు. నీళ్లు అడుగంటితే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు.