పటాన్చెరు, జూలై 4: ఇస్నాపూర్ జాతీయ రహదారిపై డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెనుకనుంచి వచ్చి మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఒక కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్చెరు ఎస్ఐ ప్రసాద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తానుంచి సంగారెడ్డి వైపు ప్రముఖ్నగర్ వద్ద యూటర్న్ తీసుకొని పటాన్చెరు వైపు వెళ్తుండగా సంగారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి సునీల్, రమచందర్ బైక్ను, వెంగళ సరేశ్చారి వెళ్తున్న మోటర్ సైకిల్ను, మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వెంగళ సురేశ్చారి, రామచందర్ అక్కడికక్కడే మృతి చెందారు. సునీల్, గోపాల్ అనే వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో మరణించిన నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన వెంగళ సురేశ్చారి(45) శిల్పిగా ఇస్నాపూర్ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నాడు. ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ధరావత్ రామచందర్(52) ప్రైవేట్ ఉద్యోగి. తీవ్ర గాయాలైన సునీల్ చావ, గోపాల్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు. వెంగళ సురేశ్ స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైస్పీడ్తో ప్రాణాలకు గండం
ఇస్నాపూర్ చౌరస్తాను రెండేళ్ల క్రితం విస్తరించారు. ముత్తంగి చర్చినుంచి ఆంధ్ర కాలనీ వరకు కిలోమీటర్ వరకు రోడ్డును అభివృద్ధి చేశారు. దీంతో అతి విశాలంగా ఉన్న రోడ్డుపై వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. ఏపీజీవీబీ బ్యాంక్ ముందున్న యూటర్న్, ప్రముఖ్నగర్ ఎదుట ఏర్పాటు చేసిన యూటర్న్లు శాస్త్రీయంగా ఏర్పాటు చేయలేదు. స్పీడ్ని నియంత్రించే వ్యవస్థలు అక్కడ కానరావడం లేదు. సైన్బోర్డులు కూడా పెట్టలేదు. జాతీయ రహదారిని విస్తరించిన ఎన్హెచ్ 65 అధికారులు రోడ్డుపై వేగ నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేయలేదు. ట్రాఫిక్ విభాగం అధికారులు చౌరస్తాలో ఉన్నా వారి సేవలు ఉదయం, సాయంత్రం మాత్రమే కన్పిస్తున్నాయి. యూటర్న్ల వద్ద ట్రాఫిక్ సిబ్బంది కానరావడం లేదు. రోడ్డు విస్తరించిన ప్రాంతంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ను కంట్రోల్ చేస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు చెబుతున్నారు.