సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మొదట్లో ఆశించిన స్థాయిలో వానలు కురువకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కురుస్తున్న వానలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాల్లో ముందుగా వేసిన పంటలు ముసురుకు అక్కడక్కడ కొద్దిగా దెబ్బతిన్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లాలో 282 మీ.మీటర్లు, మెదక్ జిల్లాలో 42.1 మీ.మీటర్ల వర్షపాతం నమోదైంది. వనదుర్గా, సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తున్నది. మరో మూడురోజులపాటు వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది.
సంగారెడ్డి/ మెదక్, జూలై 19 (నమస్తే తెలంగాణ): అల్ప పీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలను ముసురు అలుముకున్నది. పలు గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఆయా జిల్లాల్లోని జలవనరులు నిండి అలుగుపోస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగమైన కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవహిస్తున్నది. బుధవారం సంగారెడ్డి జిల్లాలో 28.2 సె.మీ, మెదక్ జిల్లాలో 42.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
‘సింగూరు’లోకి కొనసాగుతున్న వరద
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఎగువభాగమైన కర్ణాటకలో వ ర్షాలు కురుస్తుండడంతో వరదనీరు సింగూరులోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి బుధవారం 2875క్యూసెక్కుల జలాలు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 18.640కు చేరుకుంది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు వర్షాలతో నిండుతున్నది. ప్రాజెక్టులోకి 752 క్యూసెక్కుల జలాలు వచ్చాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం 383.437 ఎంసీఎఫ్టీకి చేరింది. ఈ వర్షాలతో మెదక్ జిల్లాలోని ఘనపూర్, పోచారం ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది.
నిండుతున్న జలవనరులు..
వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులు నిండుతున్నాయి. చెక్డ్యామ్లలోకి వర్షం నీరు వచ్చి చేరుతున్నాయి. జిల్లాలో మొత్తం 1374 చెరువులు ఉండగా ప్రస్తుతం 436 చెరువుల్లోకి 75 శాతం నీరు వచ్చాయి. ఐదు చెరువుల పూర్తిగా నిండగా, రెండు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. సిర్గాపూర్లోని గచ్చుమత్తడి, పెద్దమత్తడిలు అలుగు పారుతున్నాయి. వర్షాలు ఇలాగే కురిస్తే త్వరలోనే జిల్లాలోని చెరువులు వందశాతం నీటితో నిండనున్నాయి. చెరువులు నిండుతుండంతో ఆయకట్టు రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. చెరువులు నిండితే ఆయకట్టు కింద వరి సాగు విస్తీర్ణం పెరగనుంది.
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు..
మూడు రోజులుగా కురుస్తున్న ముసురువర్షంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాత బడిన ఇళ్లలో నివాసం ఉండవద్దని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పూరిండ్లలో రాత్రివేళల్లో పడుకోవద్దని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో తహసీల్దార్లు, పోలీసులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ముసురుతో వరినాట్లకు విఘాతం కలిగింది. ఇన్నాళ్లు వానలు లేక వరి నాట్లు వేయని రైతులు వర్షంలోనూ తడుస్తూ పొలాన్ని దున్ని, పొతం చేసి వరినాట్లు వేస్తున్నారు. వర్షాలతో కొత్త నీరు చేరి డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 28.2 సెం.మీ వర్షపాతం
సంగారెడ్డి జిల్లా అంతటా 28.2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 17 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువస్థాయిలో వర్షం కురవగా, ఒక్క మండలంలో తక్కువ కురిసింది. అత్యధికంగా గుమ్మడిదల మండలంలో 4.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిన్నారంలో 4.4 సెం.మీ, సిర్గాపూర్లో 4.3, కంగ్టిలో 3.9, మొగుడంపల్లి, హత్నూరలో 3.7 సెంమీటర్ల వర్షం కురిసింది. నిజాంపేట, చౌటకూర్, పుల్కల్, అందోల్, మునిపల్లి, వట్పల్లి, ఝరాసంగం, రాయికోడ్, నాగల్గిద్ద, నారాయణఖేడ్ మండలాల్లో 3 సె.మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మిగితా మండలాల్లో 1 నుంచి 2 సెం.మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో సంతోషం కనబడుతుంది.
మెదక్ జిల్లాలో చిరుజల్లులతో మొదలై…
మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మొదలైన ముసురు బుధవారం సాయంత్రం వరకు మోస్తరుగా పడింది. మొత్తం జిల్లాలో మెదక్ జిల్లాలో 42.1 మి.మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మెదక్లో అత్యధికంగా 59.2 మి.మీ, చిన్నశంకరంపేటలో 58.2 మి.మీ, కొల్చారంలో 55.9 మి.మీ, హవేళీఘణాపూర్లో 58.2 మి.మీ, చేగుంటలో 47.7 మి.మీ, నర్సాపూర్లో 47.6 మి.మీ, కౌడిపల్లిలో 46.4 మి.మీ, రామాయంపేటలో 48.5 మి.మీ, పెద్దశంకరంపేటలో 43.6 మి.మీ, వెల్దుర్తిలో 45.7 మి.మీ, నార్సింగిలో 40.1 మి.మీ, నిజాంపేటలో 39.0 మి.మీ, పాపన్నపేటలో 36.3 మి.మీ, అల్లాదుర్గంలో 38.2 మి.మీ, రేగోడ్లో 32.0 మి.మీ, చిలిపిచెడ్లో 35.3 మి.మీ, శివ్వంపేటలో 33.1 మి.మీ, తూప్రాన్లో 30.5 మి.మీ, మనోహరాబాద్లో 19.4 మి.మీ, మాసాయిపేటలో 37.4 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముసురుతో పొలం దమ్ము పనులు ముమ్మరంగా సాగాయి. ఇక పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనులు, ఉద్యోగాలకు వెళ్లే వారంతా, వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, కూలీలు కాస్త ఇబ్బంది పడ్డారు. రోడ్లు, వీధులన్నీ చిత్తడిగా మారిపోయాయి. వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి : మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని
మెదక్ అర్బన్, జూలై 19: జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్శాఖ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని జిల్లా పోలీస్ సిబ్బందికి సూచించారు. వర్షాల దృష్ట్యా 24గంటల పాటు పెట్రో, బ్లూ కోల్డ్స్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నదీతీరా గ్రామాల్లో అలుగుల వద్దకు వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా పోలీసు అధికారులు సిబ్బంది తమ వెంట రోప్స్, టార్చ్ లైట్స్, ట్యూబ్స్, లైవ్ జాకెట్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్అండీబీ, వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను జాగృతం చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్లపై వరద ఉధృతితో రోడ్లు తెగిపోయినా, ఉధృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, సంబంధిత గ్రామాల సర్పంచ్లను, ప్రజలను అప్రమత్తం చేయాలని వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకొని ప్రమాద నివారణ చర్యలను తీసుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్ 100, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్కు: 0845-223533, 8712657888 లకు సంప్రదించాలని కోరారు.