సుబేదారి, ఆగస్టు 9 : సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన హనుమకొండలోని ఎన్ఐటీలో మీడియాతో మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని, దేశంలోని 29 రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. చాక్లెట్ల రూపంలో చిన్నారులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసే ప్రయత్నాలు జరుగడం ఆందోళనకరమని చెప్పారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒకప్పుడు నక్సలిజం పోలీసులకు అతిపెద్ద సవాల్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. నక్సలిజం పూర్తిగా లేకుండాపోయిందని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్కార్డ్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాగా పోలీస్ అమరవీరుల కుటుంబాల సమస్యలు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి వీలుగా రూపొందించిన టీజీ వీర్ యాప్ను డీజీపీ ఆవిష్కరించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు ఈ యాప్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు.