చిన్నకోడూరు, మే 10: టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 100 శాతం సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు, సకల సౌకర్యాలు కల్పించారు. దీంతో టెన్త్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. మండలంలో 18 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 431 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఆదర్శ పాఠశాలల్లో 97 మంది, కస్తూర్బా విద్యాలయంలో 42 మంది, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 292 మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 18 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 8 మంది విద్యార్థులు 10 జీపీఏ , ఆరుగురు విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. 2018 నుంచి 2023 వరకు వరుసగా ఆరు సార్లు మోడల్ స్కూల్, కస్తూర్బా విద్యాలయాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణతో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, లోపాలను గుర్తించి వాటిని సవరించేలా చర్యలు తీసుకోవడం, రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణతో వందశాతం ఫలితాల సాధనకు దోహదపడ్డాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ విషయంలో ఉపాధ్యాయులు సమయానికి రావడం, విద్యార్థులు తరగతులకు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడడం, ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణతో పది ఫలితాల్లో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మంత్రి హరీశ్రావు కృషి, అందరి సహకారంతో మంచి ఫలితాలు వస్తున్నాయని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కృషికి నిదర్శనం ఈ టెన్త్ ఫలితాలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందేలా కృషి చేశారు. ఎప్పటికప్పుడు మంత్రి ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్కు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. పది ఫలితాల్లో చిన్నకోడూరు మండలం ఆదర్శంగా నిలిచింది.
– కూర మాణిక్యరెడ్డి, ఎంపీపీ, చిన్నకోడూరు
స్కూల్ ప్రారంభం నుంచి ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ క్లాస్లు నిర్వహించి విద్యార్థులపై శ్రద్ధ చూపించారు. బాగా చదివి మంచి ఫలితాలు సాధించగలిగాం. రోజూ ఉదయాన్నే నిద్ర లేపడం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత రీడింగ్ చేయించడం, అనంతరం టిఫిన్ చేసేవాళ్లం. ప్రత్యేక తరగతులకు వెళ్లేటట్లు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయి.
– రుచిత్రెడ్డి, 10 జీపీఏ, అల్లీపూర్ స్కూల్