సిద్దిపేట, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “విద్య అన్నింటి కంటే శక్తి వంతమైనది, గొప్పది, చాలా ముఖ్యమైనది.ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయులను మరువొద్దు. తల్లిదండ్రుల వద్ద కన్నా విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దే ఎకువ సమయం గడుపుతున్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయ వృత్తిపై ఆధారపడింది” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మారెట్ యార్డులో( ట్రెస్మా యూనియన్ ) సోమవారం జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ప్రజాప్రతినిధులతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ విద్యకు ఉన్న శక్తి ప్రపంచంలో దేనికి లేదని నోబెల్ అవార్డు గ్రహీత నెల్సన్ మండేలా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ గురువుగా ఉండి దేశానికి రాష్ట్రపతిగా అత్యున్నతమైన పదవిని అధిరోహించారన్నారు.
అతడి పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా గురువులను పూజించే కార్యక్రమాన్ని చేసుకుంటున్నామన్నారు. ఒక ప్రాంత అభివృద్ధికైనా, దేశం అభివృద్ధికైనా, దేశ నాగరికతకు ఒక చిహ్నంగా చూడాలంటే విద్య అనేది ఒక కొలమానంగా ఉంటుందన్నారు. విద్య అనేది ఒక ఉద్యోగానికో, వృత్తి కోసమే అనేది కాదు, ఉన్నతమైనటువంటి విలువలతో సమసమాజ స్థాపన కోసం హక్కుల పరిరక్షణ కోసం ఒక గౌరవప్రదమైన విలువలతో కూడినటువంటిదన్నారు. సమాజాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి విద్య ద్వారా మనిషి పొందగలుగుతారన్నారు.
ఇవాళ గొప్ప గొప్ప చదువులు చదివిన వారు కూడా వ్యాపారం, వ్యవసాయం , వారి తల్లిదండ్రుల వ్యాపారాలను కంటిన్యూ చేస్తున్నారన్నారు. ఏ పనిచేయాలన్నా, సమాజంలో గౌరవంగా బతకాలన్నా దానికి విద్య తప్పనిసరి అని అన్నారు. మన దేశంలో విద్యను అత్యధికంగా అందుకున్న రాష్ట్రం కేరళ అన్నారు. జీవన విధానంలోనైనా, భవిష్యత్ అవసరాల కోసమైనా పిల్లలను బాగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు చదువుకున్న వారైతే ఆపిల్లల విద్యాభ్యాసం వేరే విధంగా ఉంటుందన్నారు. ఏరంగంలో చూసినా చదువు అనేది చాలా ముఖ్యమన్నారు. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు సమకూర్చినా సుమారు 50శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సొంతంగా 5లక్షల బీమా చేయిస్తామని మంత్రి తెలిపారు.
విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే..
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని మంత్రి హరీశ్రావు అన్నారు. సమాజంలో కొద్ది మందికే ఆగౌరవం ఉంటుందన్నారు. పిల్లలకు చదువుచెప్పే ఉపాధ్యాయులు, దేశాన్ని రక్షించే సైనికులు, దేశానికే అన్నం పెట్టే రైతులకు మాత్రమే సమాజంలో గౌరవం ఉందన్నారు. ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పిల్లలను ఒక కలెక్టర్ అయినా, మరే ఉన్న త ఉద్యోగం చేసినా మొదటగా ఉపాధ్యాయుడికి పాదాభివందనం చేస్తారన్నారు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా చదువు చెప్పింది ఉపాధ్యాయుడే ..తల్లిదండ్రులను ఎంతగా గౌరవించుకుంటామో, ఉపాధ్యాయులను కూడా అంతే గౌరవించుకుంటామన్నారు. ఆ ప్రేమ అభిమానం, ఉపాధ్యాయుల పట్ల ఎంత ఎత్తుకు ఎదిగినా అలానే ఉంటుందన్నారు. జన్మనిచ్చేది తల్లి అయితే.. తీర్చిదిద్దేది ఉపాధ్యాయులన్నారు.
తల్లి దండ్రులు నడక నేర్పవచ్చుగానీ ,విద్యాబుద్ధులు నేర్పింది మాత్రం ఉపాధ్యాయులేనన్నారు. ఒక ప్రాంతం, దేశం అభివృద్ధి చెందాలంటే, ఒక మార్పు చూడాలంటే అది ఉపాధ్యాయులు, విద్యపైనే ఉంటుందన్నారు. గతంలో నంది ఎల్లయ్య లాంటి నాయకులు చెప్పిన హామీలు గోడ మీద రాతలుగా మిగిలిపోయాయి, నాటి రాతలు నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజమయ్యాయన్నారు. సిద్దిపేటను బాగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇంకను కూడా అభివృద్ధి చేసుకుంటామన్నారు.నాడు ఎన్నికల నినాదాలుగా ఉన్నవి నేడు సీఎం కేసీఆర్ సహకారంలో పూర్తి చేసుకున్నామన్నారు. సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సాగు నీరు తెచ్చుకున్నాం. ఈ నెల 15న సిద్దిపేటకు రైలు వస్తుందన్నారు.సిద్దిపేట అభివృద్ధి హబ్గా మారిందన్నారు. విద్యకు నిలయంగా, విద్యా క్షేత్రంగా సిద్దిపేటను మార్చుకున్నామన్నారు.సిద్దిపేటలో దసరా వరకు వెయ్యి పడకల దవాఖాన ప్రారంభం చేసుకుంటామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
మీ అందరి ఆశీస్సులు సీఎం కేసీఆర్కు ఉండాలి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. విద్య, వైద్యం, సాగు తదితర రంగాల్లో ప్రగతిని సాధించామన్నారు.దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మీరంతా నిండుగా ఆశీర్వదించాలన్నారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారని, వారి మాటలను నమ్మవద్దన్నారు. వారికి అధికార యావ తప్ప ప్రజలకు సేవ చేద్దామనే తపన లేదన్నారు. ఇం తగా అభివృద్ధి చేసిన రాష్ర్టాన్ని వారి చేతిలో పెడితే ఏమవుతుందో మీరంతా ఒక సారి ఆలోచన చేయలన్నారు. ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు అండగా ఉంటామన్నారు.