చౌటకూర్, మే 28: ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నది. మండలంలోని శివంపేట, వెండికోలు, కోర్పోలు, సరాఫ్పల్లి, చౌటకూర్ గ్రామాల శివారు గుండా ప్రవహిస్తున్న మంజీరా నదిలో పెద్దఎత్తున సహజ సిద్ధంగా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఇసుక మేటలపై కన్నేసిన అక్రమారులు కొందరు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా గాడిద లు, ట్రాక్టర్లపై ఒడ్డుకు చేర్చి ఇసుక నిల్వలు చేస్తున్నారు.
అనంతరం రాత్రివేళల్లో జేసీబీల సహాయంతో పెద్ద టిప్పర్లు, డంపర్లలో ఇసుకను లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. శివంపేట గ్రామ శివారులోని మంజీరా నదిలో వంతెనకు ఎగువ భాగంలో రాత్రివేళ జేసీల సహాయంతో డంపర్లు, టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సరాఫ్పల్ల్లి, శివంపేట, వెండికోలు, కోర్పోలు, చౌటకూర్లలో ట్రాక్టర్ల యజమానులు రాత్రిపూట జోరుగా ఇసుకను తరలిస్తున్నారు. ఒకో ట్రాక్టర్ యజమాని రోజుకు ఐదు నుంచి పది ట్రిప్పుల వరకు ఇసుకను మంజీరా నది నుంచి తరలిస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఒకో డంపరు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రస్తుండగా, ఒకో ట్రాక్టరు ఇసుకను రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
చౌటకూర్ మండలంలో మంజీర నదిలో అడ్డూ అదుపు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే, అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా సమాచారం అందిస్తే తూతుమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక సరాఫ్పల్లిలో 30 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇసుకను ట్రాక్టర్లలో నింపేందుకు చిలిపిచెడ్ మండలంలోని పలు గిరిజన తండాల నుంచి కూలీలను ఆటోల్లో రప్పిస్తున్నారు.
ఒకో ట్రాక్టర్ ఇసుక లోడ్ చేసినందుకు కూలీలకు రూ. వెయ్యి నుంచి రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. చౌటకూరులో కూతవేటు దూరంలో ఇసుక అక్రమ దందా కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సరాఫ్పల్లి గ్రామం వద్ద వంతెన వద్ద గల 161 జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై గతనెల రాంగ్రూట్లో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొని కొర్పోలుకు చెందిన యువకుడు మరణించాడు. ట్రాక్టర్లలో పరిమితికి మించి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాపై చౌటకూరు తహసీల్దార్ నామాల కిష్టయ్య స్పందించారు. మంజీరా నది నుంచి ఇసుక అక్రమ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో ఇసుక దందా చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.