మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 9: సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో ఇసుక అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోయే ప్రమాదం నెలకొనడంతో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని గ్రామస్తులు కొన్నేండ్లుగా కోరుతున్నారు. గ్రామం నుంచి ఇసుకను బయటకు వెళ్లనీయమని గ్రామ పంచాయతీ తీర్మానించింది. ఇతర గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పనులకు సైతం వాగు నుంచి ఇసుక అనుమతించబోమని గ్రామస్తులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. గ్రామానికి అదెరువుగా నిలిచే మోయతుమ్మెద వాగులోని ఇసుక కాపాడుకునేందుకు ఓవైపు గ్రామ పెద్దలు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు కొందరు ఇసుక అక్రమ దందా నిర్వహిస్తున్నారు.
రాత్రివేళల్లో జేసీబీల సహాయంతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రీ పగలు అని తేడా లేకుండా వాగు నుంచి ఇసుకను తోడేస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా ధూళిమిట్ట, బైరాన్పల్లి, లింగాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న ‘కొంతం’ అనే ప్రాంతంలో కొంతమంది అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేపట్టారు. వాగులోకి ట్రాక్టర్లు దిగేందుకు వీలుగా ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించి, తాటిచెట్టు ఎత్తు లోతు నుంచి ఇసుకను తీసి రాత్రివేళల్లో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మోయతుమ్మెద వాగు నుంచి పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు మీడి యా ద్వారా సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్యామ్, ఎస్సై ఆసిఫ్, ఆర్ఐ రవీందర్, జీపీవో కృష్ణతో పాటు ఇతర అధికారులు మంగళవారం సందర్శించారు. ఇసుక తరలింపుకు వీలుగా నిర్మించిన ర్యాంపులను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. అక్రమ ఇసుక రవాణా కోసం ర్యాంపు నిర్మించిన వ్యక్తిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.