‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైతయ్ అన్నట్లున్నది గీ కాంగ్రెసోళ్లతో దోస్తాని.. ఏమిట్టకేమి లేదు.. అప్పుడే గంతగింత అని దుంకుతున్నరు.. భూమాత అని, 10 హెచ్పీ మోటర్లని గాళ్లకిష్టమచ్చినట్లు మాట్లాడుతున్నరు. అటుదిరిగి ఇటుదిరిగి భూమాతకు ఎసరు పెట్టేందుకు మళ్లా కల్లబొల్లి మాటలు జెప్తూ మనల్ని మాయజేసేందుకు వస్తున్నరు. గిప్పుడు జాగురత పడకుంటే మళ్లీ మన బతుకులు ఆగమైతయి’.. అని జిల్లాలోని రైతులు ముచ్చటించుకుంటున్నరు. మూడు గంటల కరెంట్ పాత రెవెన్యూ విధానం తెస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుండడంతో మళ్లీ పాతరోజులు వస్తాయని రైతులోకం ఆందోళన చెందుతున్నది.
కాంగ్రెస్ అంటేనే రైతులు ఉలిక్కిపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడుగంటల విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు అనేక విధాలుగా నష్టపోయారు. లోవోల్టేజీ సమస్య పట్టి పీడించింది. కరెంట్ సరిగ్గా సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయి ఆర్థికంగా చితికిపోయారు. విద్యుత్ సరఫరా కోసం రైతులు ధర్నాలకు దిగారు. కాంగ్రెస్ హయాంలో సంగారెడ్డి జిల్లాలో 68,048 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండేవి. 68,048 బోరుబావులకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం అదనపు సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు వేయాల్సి ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి జిల్లా రైతుల కరెంటు కష్టాలు తీరిపోయాయి. సీఎం కేసీఆర్ జిల్లాలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రూ.1065.77 కోట్లతో జిల్లాలో కొత్త సబ్స్టేషన్లు, కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త విద్యుత్లైన్లను ఏర్పాటు చేశారు. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు జిల్లాలో 1.01 లక్షలకు చేరుకున్నాయి. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో రైతులు సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నారు.
మెదక్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రైతుల భూములకు ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాతను తీసుకువస్తామన్న వ్యాఖ్యలు చేస్తున్నదని జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ చూపిస్తున్న అత్యుత్సాహంపై రైతులు మండిపడుతున్నారు. పట్టా పాస్బుక్లో కౌలుదారు పేరును చేర్చి రైతుతో సమానంగా హక్కులు కల్పిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి మాటలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మే స్థితిలో లేరు. మళ్లీ పాత పద్ధతిలోనే పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చి అవినీతికి ఆస్కారమిచ్చేలా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. కౌలుదారు చట్టంతో అసలు భూ యజమానులు కౌలుకు ఇచ్చే భూములపై యాజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. భూ యజమానులు తమ భూమిని కౌలుకు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా ఐదేండ్ల పాటు కౌలుకు రాసివ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఐదేళ్ల తర్వాత కౌలు రద్దు చేసుకోలేనట్లయితే మరో ఐదేండ్లు పొడిగింపబడుతుందనే చట్టం ద్వారా తెలుస్తున్నది. దీంతో భూ యజమానులకు కొత్త కష్టాలు మొదలవుతాయి.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ హయాంలోనే రైతులు ఆనందంగా ఉన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రైతులు వ్యవసాయ భూములు అమ్మాలన్నా, కొనాలన్నా పైరవీకారులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కార్యాలయాల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకునే పరిస్థితి కూడా లేదు. మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుంటే చాలు 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పటికప్పుడు మ్యుటేషన్ కాపీని కూడా రైతుకు అందిస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కావాలంటే రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టు తిరగాల్సి వచ్చేది. ముడుపులు సమర్పించినా పని మాత్రం అయ్యేది కాదు. దీంతో రైతు విసిగి వేసారి ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా పూర్తికావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్లో ఏ సమస్య వచ్చినా ఇట్టే పరిష్కారమయ్యేలా చూసుకుంటున్నారు. పకడ్బందీగా ధరణిని అమలు చేసి రైతులకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతాంగం అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తమంటున్నరంట. గా.. ధరణి వచ్చిన సంది ఒక్క దగ్గరే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అయిపోతున్నది. రైతులకు సర్కారు ఆఫీసులు సుట్టూ తిరుగుడు తప్పింది. ధరణి రద్దు చేస్తే రైతులు శానా గోస పడ్తరు. దినాం రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాలే.. గందుకే కేసీఆర్ సార్ రైతులు కష్టాలు తెలిశే.. ధరణి తెచ్చిండు. మల్ల గిట్లా కాంగ్రెస్ సర్కారు వస్తే రైతుల తిప్పలు మల్ల షురు అవుతయ్. మల్ల పటేల్, పట్వారీల కాలం వద్దు. గాళ్లతో ఏం పని. ధరణి వచ్చినంకే శానా మంది కష్టాలు తీరినయ్.
ధరణి పోర్టల్తోనే రైతులకు మేలు జరిగింది. భూ రికార్డులకు భద్రత కలిగింది. కాంగ్రెస్ ధరణిని తీసేస్తాననడం మూర్ఖత్వం. ధరణితో భూముల హక్కులపై దళారుల పెత్తనం పూర్తిగా తొలిగిపోయింది. లంచాల బాధపోయింది. రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన జరిగి వేలిముద్రల సాయంతో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మ్యుటేషన్ కూడా వెంటనే ఇస్తున్నరు.
ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తో మేలు జరుగుతున్నది. భూమి విస్తీర్ణం ఎక్కువ ఉన్నా కూడా మాకు 10 హెచ్పీ మోటర్ అవసరం రాలేదు. గతంలో కరెంట్ సమస్య, నీటి సమస్యతో పంటలు పండక అప్పులే మిగేలేవి. తెలంగాణ వచ్చాక దిగుబడులు పెరిగి, ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. ఈ ఏడారి వరి,పత్తి మంచిగా పండినవి. కాంగ్రెస్లో 3 గంటల కరెంట్,10 హెచ్పీ మోటర్లు పెట్టుమనడం చాలా బాధకారం. మళ్లీ తెలంగాణ వందేళ్ల వెనక్కి పోతది. రాత్రుల్లో మోటర్ల దగ్గర ఉండే పరిస్థితి వస్తది.
బీఆర్ఎస్ సర్కారు వచ్చినాక 24 గంటల కరెంటుతో రందిలేకుండాపోయింది. 3 గంటల కరెంటుతో మూలగూడ తడవదు. గా మాత్రం ఇంగితం లేకుంటే ఎట్ల. 3 గంటల కరెంటుతో ఎవుసం బందు చేసుకోవల్సిందే. గప్పటి సర్కారోళ్లు ఇచ్చిన కరెంటుతో ఎన్నో తిప్పలు పడ్డాం. కరెంటు కోసం మోటర్ల దగ్గర పండుకుని రాత్రి, పగలు కాపలా కాస్తూ పొలానికి నీళ్లు పెట్టినం. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సార్ వచ్చి నంక తొమ్మిదేండ్ల నుంచి ఇబ్బందులు లేకుండా పంటలు పండిస్తున్నం. 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెసోళ్లు మాకొద్దు. రైతులకు కష్టాలు తీర్చే ప్రభుత్వానికే మద్దతిస్తం.
ఎక్కువ మంది రైతులకు రెండు, మూడు, ఐదు ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడు లేదా ఐదు హెచ్పీల మోటర్లతో వ్యవసాయ చేస్తున్నాం. దీంతో కావాల్సినంత నీళ్లను నెమ్మదిగా తోడుకుంటున్నాం. రోజంతా కరెంట్ ఉండడంతో అవసరం ఉన్నప్పుడు వెళ్లి మోటర్లను వేసి నీళ్లను పారబెడుతున్నాం. మూడు, ఐదు హెచ్పీల మోటర్లకు, అందుకు కావాల్సిన పైపులు వాటికి అక్కడికక్కడి పైసలు పెట్టి చేసుకుంటున్నాం. అలాంటింది 10 హెచ్పీ మోటర్లు, వాటికి తగినంత పైపులు, ఇతర సామాన్లు కావాలంటే లక్షల రూపాయలు అవుతాయి, వాటిని ఎక్కడి నుంచి తేవాలి. ఒక వేళ ఏదేని సమస్యతో మోటర్లు కాలిపోతే వాటిని తరలించడం, రిపేర్లు చేయించి, మళ్లీ తెచ్చి బిగించాలన్న ఎంతో ఇబ్బంది. ప్రస్తుతం ఉన్న మూడు, ఐదు హెచ్పీ మోటర్లు చాలు, ఇలాగే కరెంట్ ఇంటే మంచిగా వ్యవసాయం చేసుకుంటాం.
యాసంగిలో మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతది. ఇరవై, ముప్పై ఎకరాల భూస్వాములే 10 హెచ్పీ మోటర్లు వాడుతలేరు. ఇక మాములు చిన్న, సన్నకారు రైతులతోటి అయితద. రైతులకు 5హెచ్పీ, 6హెచ్పీ వరకు సరిపోతాంది. 24 గంటల కరెంటు అయితేనే నడుస్తుంది. ఫుల్ పోసే బోర్లకైతే 6హెచ్పీ మోటర్ సరిపోతది. రాజకీయ నాయకులు వాళ్ల అవసరం కోసం అవగాహన లేక మాట్లాడుతుండ్రు. రైతులు మోసపోవద్దు.
కాంగ్రెస్ పార్టీ పైరవీకారులకు కొమ్ముకాస్తది. అందుకోసమే రైతులను నిండా ముంచాలని పటేల్, పట్వారీ వ్యవస్థను ముందుకు తెస్తున్నది. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తానంటున్న వాళ్లు తెలంగాణను ఏం ఉద్దరిస్తరు. రైతుల కోసం కేసీఆర్ ధరణి పోర్టల్ను తెచ్చి మంచిగ చేస్తుంటే, వీళ్లు ఎన్నికలు ఉన్నాయి గదా అని నిండా ముంచాలని చూస్తుండ్రు. కాంగ్రెస్ వాల్లు ఇప్పటికే వీఆర్వోలను భర్తీ చేస్తామని చెబుతున్నరు. గ్రామ స్థాయిలోనే రైతుల భూములను ఇష్టం వచ్చినట్లు మార్చే పాత రాత పద్ధతిని తీసుకొస్తామని చెప్పింది. రైతుబంధు అందుకుంటున్న వారిలో ఎక్కువ శాతం చిన్న సన్నకార రైతులే ఉన్నారు. ధరణి బంధు చేస్తే రైతులకు ఆ పార్టీ వాల్లు ఇబ్బందులు కలిగించిన వారవుతారు. మనం రైతులమంతా కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి పద్ధతిలోనే నడుద్దాం.
గా.. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు ఒకేసారి రైతులంత 10 అస్పర్ల మోటర్లు చాల్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు గడికీ పాడవుతయ్. గ్రిడ్పై లోడ్ పడి కరెంటు సరిగ్గా సైప్లె కాదు. రైతులంతా లచ్చ రూపాలు సొమ్ము బెట్టి 10 అస్పర్ల మోటర్లు తెచ్చుకోవడం పేద రైతులుతోంటి కాదు. 24 గంటల కరంటు ఇస్తేనే రైతులు ఒకేసారి గాకుండా ఎవ్వలికి వీలైనప్పుడు వాళ్లు పంటలకు నీళ్లు పెట్టుకుంటుడ్రు. దీంతో కరంటుపై బరువుపడదు. సీఎం కేసీఆర్ సార్తోనే రైతులందరికీ ఎవుసంలో ఏ రంది లేదు. శానా మంచిగ వుంది. రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు బాగుంది. మల్ల కేసీఆర్ సారే రావాలే.
వ్యవసాయం చేసే రైతులకు తెలుస్తది కరెంట్ ఎన్ని గంటలు కావాలో, వ్యవసాయం చేయని, తెలియని వాళ్లకు కరెంట్ కష్టాలు, రైతుల బాధలు ఎలా తెలుస్తాయి. రైతులను ఇప్పుడున్న బీఆర్ఎస్ సర్కార్ అన్ని విధాల ఆదుకుంటుంది. ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో పాటు, కాళేశ్వరం నీళ్లు రావడంతో కావాల్సినంత సాగు నీళ్లు హల్దీవాగులో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వీలు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వెళ్లి మోటర్లను చాలుచేసి నీళ్లు పారబెడుతున్నాం. కానీ కాంగ్రెసోళ్లు చెప్పినట్లు మూడు గంటలు కరెంట్ ఇస్తే రైతులం ఆగం మవుతాం. పంటలు పండక కూలీ పనులకు వెళ్లాల్సి వస్తుంది.
ఇప్పుడున్న కరెంట్ మంచిగుంది. ఎప్పుడంటే అప్పుడు వెళ్లి మోటర్లు చాలుచేసి పొలానికి నీళ్లు పారబెట్టి, బంద్ చేస్తున్నాం. కానీ అంతుకుముందున్న కాంగ్రెసోళ్లు రాత్రి, పగలు, టైం పెట్టి కరెంట్ ఇచ్చేటోళ్లు, దీంతో కరెంట్ ఎప్పుడొస్తదో తెల్వక పొలాల దగ్గర పడుకుని, మేలుకువ ఉండి, పొలాల వద్దకు వెళ్లి మోటర్లు వేసేటోళ్లం. సగం పారుతుందో లేదో మళ్లా కరెంట్ పోయేది. మళ్లీ వచ్చేదాకా ఎదురు చూసేటోళ్లం. కానీ ఇప్పుడు కరెంట్ పోయేదే తెలుస్తలేదు. ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టి మోటర్లు వేసి ఇంట్లో పండుకుంటున్నాం. పొలాల దగ్గర పడుకునేదే లేదు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణితోనే మా వ్యవసాయ కష్టాలు తీరినయ్. అంతకు ముందు భూమి రిజిస్ట్రేష న్కు పోతే నెలలు గడిచే వి. ఇప్పుడు కేసీఆర్ కొత్తగా తెచ్చిన ధరణి వ్యవస్థతో 15 నిమిషా ల్లోనే భూమి రిజిస్ట్రేషన్ కాగితాలు చేతికొస్తున్న య్. నేను మా తాత నుంచి ఎవుసం చేస్తున్న. తెలంగాణ ప్రభుత్వం లెక్క ఎవ్వరు కూడా ఇన్ని పథకాలు ఇవ్వలే. రాష్ట్రం రాకముందు పటేల్, పట్వారీ వ్యవస్థతో మస్తుగ ఇబ్బందులు పడ్డం. పదేండ్ల కింద పహాణీ చౌపస్లా కావాలంటే పట్వారీ సంతకం పెట్టి రాసియ్యాలి. అక్కడికెళ్లి గిర్దావర్ దగ్గరకు పోయి ఆ సార్ సంతకం పెట్టించాలి. అక్కడికెళ్లి తహసీల్దార్ దగ్గరకు పహాణీ తీసుకుని పోవాలే. అప్పుడు తహసీల్దార్ రికార్డులన్నీ చూసి అండ్ల పేరుంటేనే సంతకం పెట్టి ఇస్తుండే లేకుంటూ మా కాగితాలను దూరంగా పడేస్తుండే. ఈ తతంగం అంతా దాదాపు నెల రోజుల వరకు తిప్పుకుని కాలి చేతులతో పంపించెటోళ్లు. ఒకవేళ అన్ని మంచిగుంటే పాసు బుక్కు కోసం కాళ్లు అరిగేలా తిగిపించుకునే వారు. ఇప్పుడు కేసీఆర్ సార్ తెచ్చిన ధరణితో ఇబ్బంది లేకుండా నేరుగా తహసీల్ ఆఫీస్కు పోయేటట్టు చేసిండు. మధ్య దళారీలు లేకుండా పోయి పని చేసుకుంటున్నం. మాకు ధరణితోనే బాగుంది.
ధరణి రాక ముందు భూములకు భరోసా ఉండేది కా దు.. భూములు అమ్ముకున్న రిజిస్ట్రేషన్కు పడరా ని పాట్లు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆబాధే లేదు. మధ్య దళారుల బెడద లేకుండా గంటల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. అందు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అవుతున్నా యి. ధరణి పుణ్యమని పొలాలను ఎవరూ తమ పేరుపై మార్చుకునే అవకాశం లేదు.
రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది.. ఇది కేసీఆర్ సార్కు తె లుసు అందుకే అ న్ని తీర్ల అదుకుంటున్నడు. తెలంగణ ప్ర భుత్వం 24 గంట ల కరెంటు ఇవ్వడం వల్లే పంటలు బాగా పండుతున్నాయి. ఏ మేరకు నీరు అవసరమే ఆమేరకు పంటలు సాగు చేసి దిగుబడులు సాధిస్తున్నాం. కరెంట్ జోలికొస్తే ఊరుకునేది లేదులేదు.
ధరణితో భూ సమస్యలు లేకుండా అయ్యాయి. ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతున్నది. పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. రైతులు అధికారులు, కార్యాలయా ల చుట్టూ తిరిగే పని లేదు. సమ యం వృథా కాదు. ఎవరి చుట్టూ తిరిగే పని లేదు. ధరణి వచ్చాకే రైతు బంధు, రైతు భీమా వచ్చి అండగా నిలుస్తున్నాయి. భూమిని అమ్మాలన్నా కొనాలన్నా.. ఇబ్బందులు తొలిగినయ్, పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూ సమస్యలకు ధరణితో చెక్ పడింది. ధరణి పోర్టల్ను రద్దు చేస్తే రైతుల బతుకులు ఆగమవుతయ్.
పదేండ్ల కింద ఎవు సం చేసేందుకు చేనులకు పోయి కరెంట్ లేక అర్ధరాత్రి చేను చెలకల కాడనే పండుకున్నం. ఎప్పుడో గంటసేపు వచ్చేది. మల్ల రాంగనే ముందు ఉన్న వాళ్లు స్టాటర్ చాలు చేస్తేనే బోర్లలో నుంచి నీళ్లు వచ్చేటివి. లేకుంటే నీళ్లు వచ్చేటివి కాదు. అందుకోసం కరెంట్ కోసం రాత్రి బోర్లవద్దనే పడుకుంటుంటుమి. నిద్రలేకుండా ఎన్నో రాత్రులు గడిపినం. కరెంట్ వచ్చే ఆ రెండు గంటల కోసం పాములు, తేళ్లు మా చుట్టురా తిరిగేటివి. అయినా వాటిని చంపుకుంటూ రాత్రిల్లు ఉండేటోళ్లం. అప్పటి క్షణాలు గుర్తు చేసుకుంటే ఇప్పుడు అవి ఎట్ల గడిచినయో అంటూ భయమైతది. ఆ బతుకు మల్ల రావద్దు బిడ్డో. కేసీఆర్ సార్ వచ్చిండంటే మాకు కరంట్ తిప్పలు తప్పినయ్.
గప్పట్ల అయితే నీళ్లు తాగుదామన్నా వ్యవసాయ బోర్ల వద్దకు కరంట్ వచ్చినప్పుడు బిందెలు పట్టుకుని ఎగబడేటోళ్లం. అయినా నీళ్లు దొరకక చానా ఇబ్బందిపడ్డాం. ఏ రాత్రి కరంట్ వచ్చినా ఆ రాత్రి నీళ్ల కోసం పోయెటోళ్లం. పిల్లలకు కూడా చెంబులిచ్చి నీళ్లు పట్టుకుని వచ్చెటోళ్లం. ఇన్ని కష్టాలు పడ్డ మాకు తెలంగాణకు సీఎంగా కేసీఆర్ వచ్చిండంటే మా బాధలన్నీ తీరినయి. లేకుంటే ఇప్పటికైనా గప్పట్లెక్కనే ఉండెటొళ్లమేమో. ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నయ్. వాటినే తాగుతున్నం. మల్ల లేనిపోని ఆశలు చూపిస్తున్న కాంగ్రెసోల్లు ఏమీ చేయరు. వారున్నప్పుడే పడ్డం ఇవన్ని గోసలు. ఇంకా గోసలు పడ్తమా. మాకు వాల్లద్దు వాల్ల గొవర్నమెంటు అద్దు. మాకు మా కేసీఆర్ సారే కావాలే.