చేర్యాల, మార్చి 18: బీజేపీ సర్కారు రాజ్యాంగబద్ధ్ద వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వాటిని గుప్పెట్లో పెట్టుకుని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజల హక్కులనే కాకుండా రాష్ర్టాల హక్కులను హరించి వేస్తున్నదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు ఆరోపించారు. సోమవారం చేర్యాలలోని వాసవీ గార్డెన్స్లో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని, ఈడీ, సీబీఐలతో దా డులు చేయిస్తున్నదని ఆరోపించారు.
కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నదన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ జాతి సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వేలకోట్ల రూపాయలను బీజేపీ సొమ్ము చేసుకున్నట్లు ఆరోపించారు. భువనగిరి లోక్సభ స్థానం నుంచి సీపీఎం పోటీచేస్తుందని తెలిపారు. సమావేశంలో నాయకులు నక్కల యాదవరెడ్డి, రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్మావో, ఆలేటి యాదగిరి, రాళ్లబండి నాగరాజు, చొప్పరి రవికుమార్, బద్దిపడగ కృష్ణారెడ్డి, బండకింది అరుణ్కుమార్, శారద, దాసరి ప్రశాంత, తాడూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.