పుల్కల్, సెప్టెంబర్ 26: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇన్ఫ్లో 14,563 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 19,107 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ 29.827 టీఎంసీలు ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులోకి వరద వస్తున్నందున గొర్లకాపరులు, మత్స్యకారులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.