చేర్యాల, జూలై 31: కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతోపాటు మట్టి పాత్రలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకుడు నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
మల్లన్న దర్శించుకున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్
కొమురవెల్లి మల్లికార్జున స్వామిని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజ లు నిర్వహించడంతోపాటు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ పట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6541 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద రూ.6వేలు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్వీ సీనియర్ నాయకుడు ఏర్పుల మహేశ్ ఉన్నారు.
విద్యాధరి క్షేత్రం, నాచగిరిలో పూజలు
వర్గల్, జూలై 31 : వర్గల్ విద్యాధరిక్షేత్రం, నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నాచగిరిలో స్వామివారి పేరిట కల్యాణాలు జరిపించారు. వర్గల్ సరస్వతీమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వాహక, పాలకమండలి సభ్యులు తగు ఏర్పా ట్లు చేశారు.