మిరుదొడ్డి, జూలై 27: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడటం లేదని, ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి మండలాల్లో 29 గ్రామాల సర్పంచ్లు, ఆయాశాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వరి, మొక్కజొన్న కాకుండా ఆయిల్పామ్ సాగుచేస్తే అధిక ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు ఆయిల్పామ్ సాగుచేసేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. సర్పంచ్లు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు.
గ్రామాలను శుభ్రంగా ఉంచు తూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేవిధంగా సర్పంచ్లు చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుందన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా అధికారులు దుబ్బాక నియోజకవర్గంపై చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా డీఆర్డీవో పీడీ జగదేవ్ ఆర్యా, డీఎల్పీవో చందన, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి. మిరుదొడ్డి ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్, ఆయాగ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.