ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం ఏరులైపారింది. మద్యం దుకాణాలు, బార్లు కికిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.37.27కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సోమవారం అర్ధరాత్రి వరకు మద్యం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగాయి. 2022 డిసెంబర్ 30, 31లో రూ.28 కోట్ల విలువ చేసే మద్యం అమ్మగా, 2023 డిసెంబర్ 30, 31లో రూ.37.27 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడంతో ఎక్సైజ్శాఖకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరింది. గతేడాది కంటే అధికంగా 9.5 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
సంగారెడ్డి/ మెదక్ (నమస్తే తెలంగాణ), జనవరి 1: ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలు ఆదివారం రాత్రి 12 గంటలకు 2023కు వీడ్కోలు పలికి 2024 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం పొంగిపొర్లింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం అమ్మకాలు తారా స్థాయిని తాకాయి. డిసెంబర్ 30, 31వ తేదీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.37.27 కోట్ల మద్యం విక్రయించారు.
పెద్దఎత్తున ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31వరోజు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించేందుకుఅనుమతి లభించడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. మొత్తం 243 మద్యం దుకాణాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 243 మద్యం దుకాణాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 101, సిద్దిపేటలో 93, మెదక్ జిల్లాలో 49 దుకాణాలున్నాయి. 70కి పైగా బార్లు ఉన్నాయి. వీటిల్లో సాధారణ రోజుల్లో అమ్మకాలు రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటాయి. న్యూఇయర్ వేడుకల సందర్భంగా శని, ఆదివారాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 37.27 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో 49,902 కేసులు లిక్కర్ అమ్మింది. సిద్దిపేట జిల్లాలో 11310 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 18,197 కేసులు, మెదక్ జిల్లాలో 7266 కేసుల మద్యం విక్రయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు రోజుల్లో 1,02,575 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2022లో చివరి రెండు రోజులు రూ.28 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరుగగా, 2023 డిసెంబరు ఆఖరి రెండు రోజుల్లో రూ.37.27 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో డిసెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 2023 డిసెంబర్ మొత్తంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.376.65 కోట్ల మద్యం విక్రయించారు. 2022లో రూ.300.51 కోట్లు. 2023 డిసెంబర్లో సంగారెడ్డి జిల్లాలో 1,92,947 కేసుల లిక్కర్, 1,89,638 బీర్ కేసులు అమ్ముడుపోయాయి. వీటి విలువ రూ.180.27 కోట్లు. సిద్దిపేట జిల్లాలో 1,29,301 కేసుల లిక్కర్, 1,66,553 బీర్ కేసుల కొనుగోలు జరిగింది. వీటి విలువ రూ.131.13 కోట్లు. మెదక్ జిల్లాలో 69.6 కేసుల లిక్కర్, 77,786 కేసుల బీర్లను మద్యంప్రియులు కొనుగోలు చేశారు. దీంతో మెదక్ జిల్లాలో రూ.64.97 కోట్ల మద్యం అమ్మారు. మొత్తంగా డిసెంబర్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం ప్రియులు రూ.376.65 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖకు సమకూర్చారు.