సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై హెల్త్క్యాంప్లో చికిత్స పొందుతున్న వారిని డీఎంహెచ్వో వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన మంగళవారం పరామర్శించారు. కలుషిత ఆహారం తినడంతోనే బాధితులు అనారోగ్యానికి గురయ్యారని, ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీపీవో తరుణ్కుమార్ గ్రామంలో పర్యటించి పరిస్థితిని తెలసుకున్నారు.
మనోహరాబాద్, ఆగస్టు 2: మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో సోమవారం రాత్రి పలువురు గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అదేరోజు రాత్రి గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. విషయాన్ని మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే రాష్ట్ర, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బందిని, 108 వాహనాలను కాళ్లకల్కు తరలించి హెల్త్క్యాంపును ఏర్పాటు చేయగా, ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాగా, మంగళవారం డీఎంహెచ్వో వెంకటేశ్వర్లుతో కలిసి కాళ్లకల్కు చేరుకొని బాధితులను, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య స్థితిపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులతో కలిసి గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకున్నారు. హెల్త్క్యాంపునకు వస్తున్న రోగులకు స్వయంగా పరీక్షలు చేశారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– ఆరోగ్య, వైద్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ కాళ్లకల్లో 17 నుంచి 20 వేల మందికి పైగా జనాభా ఉన్నారన్నారు. వారిలో ఒకే ప్రాంతానికి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారన్నారు. మిషన్ భగీరథ నీళ్ల ద్వారా అస్వస్థతకు గురికాలేదని, రోడ్ల వెంట, బయట లభించే కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారన్నారు. కాళ్లకల్లో ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బందితో ఇంటింటికీ ఆరోగ్య సర్వే నిర్వహించి వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడు రోజుల పాటు గ్రామంలో హెల్త్క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు ఉండకుండాచూసుకోవాలని, బయటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలని సూచించారు.
భయాందోళనకు గురికావొద్దు
– ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
ప్రజలు భయాందోళనకు గురికావొద్దని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కాళ్లకల్లో మంగళవారం ఉదయం పర్యటించి, బాధితులను పరామర్శించడంతో పాటు హెల్త్క్యాంపులో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కాళ్లకల్లో అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు మంత్రి హరీశ్రావు సమీక్షిస్తున్నారన్నారు. అవసరమైన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఆనంద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎంపీవో లక్ష్మీనర్సింలు, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, ఎంపీటీసీ నత్తి లావణ్య, సర్పంచ్ నత్తి మల్లేశ్, ఉప సర్పంచ్ రాజుయాదవ్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు రాహుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల్లో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
– డీపీవో తరుణ్కుమార్
కాళ్లకల్లో డీపీవో తరుణ్కుమార్ పర్యటించారు. ఆయా వార్డుల్లో తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. గానుగ బస్తీలో ఒకేచోట మురికి నీరంతా వచ్చి చేరుతుండటంతో స్థానిక అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో మురికి నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామంలో ఎక్కడ కూడా పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.