సిద్దిపేట, మార్చి 1: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లింలు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని పేర్కొన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నదాంట్లో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని, సేవా ధృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఉపవాస దీక్షలు పాటించాలని హరీశ్రావు సూచించారు.