సిద్దిపేట, ఏప్రిల్ 30: రేవంత్కు సిద్దిపేటకు వచ్చే అర్హతే లేదని, సిద్దిపేటకు మంజూరై సగం పనులు పూర్తయిన వెటర్నరీ కాలేజీని కొడంగల్కు తరలించుకుపోయిన రేవంత్రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. మంగళవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆటో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ముందుగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హకులు హరించుకుపోయాయన్నారు. బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ అన్నారు. బీజేపీ కార్మికుల హకుల కోసం కాకుండా అదానీ, అంబానీల కోసం పని చేస్తుందన్నారు. కరెంట్ సరిగా సరఫరా చేయలేక అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు, ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తుందని దుయ్యబట్టారు.
ఉద్యోగులు ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలుచేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. మళ్లీ దేవుళ్లపై ఓట్లు పెడుతూ ప్రజలను మోసం చేయాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వారి మోసపు హామీలను ఆమోదించినట్లు అవుతుందని, కాంగ్రెస్ పాలన వల్లే ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని హరీశ్రావు పేర్కొన్నారు. 28మంది ఆటో కార్మికులు చనిపోతే రేవంత్రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదని, కనీసం వారి కుటుంబాలను పరామర్శించలేదన్నారు. అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. సిద్దిపేట అంటేనే బిఆర్ఎస్ అడ్డా అన్నారు. వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకు మంజూరు చేసిన తర్వాతే రేవంత్రెడ్డి సిద్దిపేటకు వచ్చి ఓట్లు అడగాలని హరీశ్రావు అన్నారు. సమావే శంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, పాల సాయిరాం, ఎల్లయ్య, ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాస్, రామరాజు, మల్లేశం తదితర నాయకులు పాల్గొన్నారు.