రామచంద్రాపురం, జూన్ 8: రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంతో కాశీ, అయోధ్య, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ఊటీ యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకొని వచ్చిన వారు సోమవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని మయూరినగర్ కాలనీలో ఉన్న రిటైర్ట్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి యాదమ్మ దంపతులను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు కూడా పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. విశ్రాంత ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని, వారి సంక్షేమం కోసం తమ వంతు సహకారం అందజేస్తానన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించానని ఆయన గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, బీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, ఐలేశ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.