పటాన్చెరు వాసుల కల త్వరలో నెరవేరనున్నది. ఇచ్చిన హామీ మేరకు మియాపూర్ టు ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పటాన్చెరు పర్యటన సందర్భంగా మెట్రోను పొడిగించాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విన్నవించగా, తక్షణం స్పందించిన సీఎం ఇందుకోసం హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే కార్మికులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు, ప్రజలకు వరంలా మారనున్నది.
– పటాన్చెరు, జూలై 31
పటాన్చెరు, జూలై 31: పటాన్చెరులో ఈ మధ్య జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మెట్రో వరం సాకారం కానున్నది. సోమవారం రాష్ట్ర కేబినెట్ చేసిన పలు కీలక తీర్మానాల్లో మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో పొడిగింపు ఉంది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన పలు తీర్మానాలను ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. సీఎం పర్యటన సందర్భంగా పటాన్చెరు ప్రాంత ప్రజల తరపున మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో ట్రైన్ పొడిగించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సీఎం కేసీఆర్కు విన్నవించారు. తక్షణం స్పందించిన సీఎం మూడో విడుత మెట్రోను పటాన్చెరు వరకు పొడిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్ ఇస్నాపూర్ వరకు మెట్రోరైలును పొడిగిస్తూ తీర్మానించింది. పాశమైలారం, ఇస్నాపూర్, పటాన్చెరు, రామచంద్రాపురం, బీరంగూడ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు, ప్రజలకు మెట్రో వరంలా మారనున్నది. అత్యంత రద్దీతో ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. మెట్రో రైలు పొడిగింపుతో ట్రాఫిక్ సమస్యలకు చెక్పడడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. సీఎం కేసీఆర్, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.