మెదక్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా ధాన్యం సేకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేళీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లాలో పండించిన ధాన్యానికి ఎలాంటి ఆరోపణలు రాకుండా రైతుల నుంచి సమయానికి కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ధాన్యం కోతకు వచ్చిందని, ఆయా ప్రాంతాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారన్నారు. నాణ్యత గల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, ఫ్యాక్స్ సీఈవో సాయి, సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చేగుంట, ఏప్రిల్ 12: రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు అన్నారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొంటుందని ఆయన స్పష్టం చేశారు. చేగుంట మండలంలోని అనంతసాగర్, ఇబ్రహీంపూర్, బోనాల్ తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగు నీటిసౌకర్యం, నీడ కోసం టెంట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. తాళ్లు లేకుండా, ఆర బెట్టిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలన్నారు. అకాల వర్షానికి తడువకుండా టార్పాలిన్లు తెచ్చుకోవాలన్నారు. ఆయనతో చేగుంట ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, రామస్వామి, శ్వేత, స్వామి, అంజ్యానాయక్, వీవో లీడర్లు, మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.
చేగుంట, ఏప్రిల్ 12: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చేగుంటలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సొసైటీ సీవోలు, ఐకేపీ సిబ్బందితో సమీక్షించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు తొందరగా జమచేయవచ్చన్నారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీడీవో చిన్నరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, పంచాయతీ కార్యాదర్శులు, సీవోలు, సీఏలు పాల్గొన్నారు.