రూ.7300 కోట్లతో పాఠశాలల అభివృద్ధి
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
గజ్వేల్/కొండపాక, మే 13: కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం కుకునూర్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా రూ.80లక్షలతో పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. పేద,బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు.
ప్రస్తుత సమయంలో ఇంగ్లిష్ భాష తప్పనిసరిగా మారిందని, అందుకే ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను ఆంగ్లభాషలో అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ‘మనఊరు-మనబడి’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7300 కోట్ల వ్యయంతో అన్ని పాఠశాలల్లో భవనాలు, మరుగుదొడ్లు, నీటి వసతి, బోధన, క్రీడా సామగ్రి, సాంకేతిక విద్య తదితర అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సదుపాయాల కల్పనతో పాటు ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై మెళకువలను పెంచడానికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు. పాఠశాలల్లోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.