తెలంగాణను సమగ్రంగా, సంపూర్ణంగా ఆకలింపు అర్థం చేసుకున్న మేధావులు రాష్ట్రంలో ఇద్దరంటే ఇద్దరే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడారు. తెలంగాణ గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులు దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు కే.కేశవరావు అని అన్నారు. సీఎం చేసిన వ్యాఖ్య రాజకీయ, మేధోవర్గాల్లో వివాదానికి, రాజకీయ చర్చకు దారితీసింది.
తెలంగాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం, సామాజికఆర్థిక పరిస్థితులు, జలవనరులు, భాషాసాంస్కృతిక అస్తిత్వం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న వివక్ష, తెలంగాణ ఉద్యమ పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ గురించి సాధికారికంగా మాట్లాడగలిగిన, రాయగలిగిన, ప్రజలకు వివరించగలిగిన మేధావులు ఇద్దరే. వారిలో మొదటివ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. రెండో వ్యక్తి ఆ సిద్ధాంతాన్ని ప్రజా ఉద్యమంగా మలిచి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించి, తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్. తెలంగాణ చరిత్ర, ఆత్మలో ఈ ఇద్దరి పాత్రలను పక్కనపెట్టి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెసర్ జయశంకర్ కేవలం ఒక అధ్యాపకుడు కాదు. తెలంగాణకు సిద్ధాంతాన్ని అందించిన మహోన్నత మేధావి. తెలంగాణ ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలి? ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం ఏమిటి? నీళ్లు, నిధులు, నియామకాల్లో ఎలా వెనుకబడింది? తెలంగాణ భాష, సంస్కృతి, ఆత్మగౌరవం ఎలా అణచివేతకు గురయ్యాయి? అనే ప్రతి అంశాన్ని చారిత్రక ఆధారాలు, గణాంకాలతో దేశానికి వివరించిన వ్యక్తి. ఆయన తన జీవితాన్నంతా తెలంగాణ సాధనకే అంకితం చేసిన తపస్వీ.
అయితే సిద్ధాంతం ఒక్కటే రాష్ర్టాన్ని తీసుకురాదు. ఆ సిద్ధాంతాన్ని ప్రజల హృదయాల్లో నాటాలి. ఉద్యమంగా మలచాలి. కోట్లాది మంది ప్రజలను ఒకే లక్ష్యం కోసం ఏకం చేయాలి. రాజకీయ పోరాటాన్ని నిర్మించాలి. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చాలి. ఆ మహత్తర బాధ్యతను భుజాన వేసుకుని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను జాతీయస్థాయికి తీసుకెళ్లి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ భౌగోళిక స్వరూపం, చారిత్రక నేపథ్యం, జలవనరులు, వ్యవసాయం, విద్యుత్తు, ఉద్యోగాలు, ఆర్థిక అసమానతలు, భాష, సంస్కృతి, ప్రజల మనోభావాలు-ఈ అన్ని అంశాలపై కేసీఆర్కు ఉన్న అవగాహన ఉద్యమ ప్రసంగాల్లోనే కాదు, ఆయన రచనలు, శాసనసభ ప్రసంగాలు, విధాన నిర్ణయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణను కేవలం రాజకీయ అంశంగా కాకుండా, ఒక నాగరికతగా, ఒక చరిత్రగా, ఒక ఆత్మగా ఆయన ప్రజలకు పరిచయం చేశారు.
కాళోజీ నారాయణరావు, పీవీ నరసింహారావు, జైపాల్రెడ్డి, కే.కేశవరావు, వరవరరావు వంటి అనేకమంది మేధావులు, ప్రజానాయకులు ఉన్నారు. వారి సేవలను ఎవరూ తక్కువ చేయలేరు. వారంతా తెలంగాణ సమాజానికి తమ తమ రంగాల్లో విశిష్టమైన సేవలు అందించారు. అయితే, తెలంగాణనే తన జీవిత ధ్యేయంగా మార్చుకుని, తెలంగాణను శ్వాసించి, తెలంగాణనే తన ఆత్మగా జీవించిన మహనీయులు ఎవరు? అనే ప్రశ్నకు చరిత్ర చెప్పే సమాధానం ముందుగా ప్రొఫెసర్ జయశంకర్, ఆ తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.
తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రొఫెసర్ జయశంకర్ను చదవాలి. తెలంగాణ రాష్ట్ర సాధనను అర్థం చేసుకోవాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని అధ్యయనం చేయాలి. ఒకరు ఉద్యమానికి సిద్ధాంతాన్ని అందించిన మహామేధావి అయితే, మరొకరు ఆ సిద్ధాంతానికి కార్యరూపం ఇచ్చిన ఉద్యమ నేత. ఈ ఇద్దరూ తెలంగాణ చరిత్రలో విడదీయరాని అధ్యాయాలు. తెలంగాణ గురించి సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తుల జాబితా ఎప్పుడైనా రూపొందించాల్సి వస్తే, ఆ జాబితాలో తొలి స్థానాల్లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ఉండాలి. తెలంగాణను ఒక ఆలోచనగా మలిచిన జయశంకర్, ఆ ఆలోచనను రాష్ట్ర రూపంలో సాకారం చేసిన కేసీఆర్ను తెలంగాణ చరిత్ర నుంచి వేరు చేసి చూడడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అలా చేస్తే మహత్తర తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాధించిన సర్వతోముఖ వికాసం, ప్రగతిని అవమానించినట్లే!
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
వీరేంద్ర కాపర్తి