రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కారు బడులకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే మనఊరు-మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలవుతుండగా, చాలా పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. అందులో భాగంగానే సోలార్ కరెంట్ సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 98 బడులను గుర్తించారు. తొలుత పది పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, దశలవారీగా అన్ని చోట్లా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి సర్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆ ప్రక్రియ ముగియగానే సౌర పలకలు, ఇతర పరికరాలు, నెట్ మీటర్లు బిగిస్తారు. ప్రతి స్కూల్లో రెండు నుంచి నాలుగు కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల అవసరాలు తీరగా, మిగిలిన కరెంట్ను ట్రాన్స్కోకు విక్రయించే అవకాశం ఉంది. సోలార్ కరెంట్ సక్సెస్ అయితే బిల్లుల చెల్లింపు నుంచి బడులకు విముక్తి లభించనున్నది.
సంగారెడ్డి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ అందుబాటులోకి తీసుకురానున్నది. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సదుపాయం కల్పించనున్నది. దీంతో పాఠశాలలపై కరెంటు బిల్లులు చెల్లించే భారం తొలగనున్నది. పాఠశాలల విద్యుత్ అవసరాలు తీరగా అదనంగా సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే ఆ విద్యుత్ను ట్రాన్స్కోకు విక్రయించే అవకాశం ఉంటుంది. నెట్ మీటరింగ్ విధానంతో అమలుతో ఇది సాధ్యం కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 98 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. తొలుత పది పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా (పైలెట్ ప్రాజెక్టు) ప్రారంభించి ఆ తర్వాత మిగితా పాఠశాలల్లో సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నాయి. సర్వే అనంతరం ఆయా పాఠశాలలపై సౌర విద్యుత్ పలకలను ఇతర పరికరాలను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నెట్ మీటర్లను బిగిస్తారు. నెట్మీటర్లను నేరుగా ట్రాన్స్కో గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన 98 ప్రభుత్వ పాఠశాలల్లో రెండు నుంచి నాలుగు కిలోవాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్ ఉత్పతితో పాఠశాల విద్యుత్ అవసరాలు తీరుతాయి. పాఠశాల విద్యుత్ అవసరాలు తీరగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్ ద్వారా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ను రికార్డు చేసి విక్రయించటం జరుగుతుంది.
98 పాఠశాలలో సౌర విద్యుత్ కాంతులు
సంగారెడ్డి జిల్లాలోని 98 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. అమీన్పూర్ మండలంలోని నాలుగు పాఠశాలలు, అందోలు మండంలోని ఐదు పాఠశాలలు, చౌటకూరు మండలంలోని మూడు పాఠశాలలు, గుమ్మడిదల మండంలోని ఐదు పాఠశాలలు, హత్నూర మండలంలోని ఏడు పాఠశాలలు, ఝరాసంగం మండలంలోని రెండు పాఠశాలలు, జిన్నారం మండలంలోని నాలుగు పాఠశాలలు, కల్హేర్ మండలంలో ఒకటి, కంది మండలంలో ఒకటి, కంగ్టి మండలంలోని రెండు, కోహీర్ మండలంలోని మూడు, కొండాపూర్ మండలంలోని ఐదు పాఠశాలల్లో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. మనూరు మండలంలో ఒక పాఠశాల, మొగుడంపల్లి మండలంలోని రెండు పాఠశాలలు, మునిపల్లి మండలంలోని రెండు పాఠశాలలు, నాగల్గిద్ద మండలంలోని ఒక పాఠశాల, నారాయణఖేడ్ మండలంలోని ఐదు పాఠశాలలు, న్యాల్కల్ మండలంలోని మూడు పాఠశాలల్లో సౌరవిద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయటం జరుగుతుంది.
పటాన్చెరు మండలంలోని 12 పాఠశాలలు, పుల్కల్ మండలంలోని మూడు మండలాల్లో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు రాయికోడ్ మండలంలోని ఒక పాఠశాల, రామచంద్రాపురం మండలంలోని ఐదు పాఠశాలలు, సదాశివపేట మండలంలోని ఆరుపాఠశాలలు, సంగారెడ్డి మండలంలోని రెండు, వట్పల్లి మండలంలోని రెండు, జహీరాబాద్ మండంలోని ఎనిమిది పాఠశాలల్లో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే పైలెట్ ప్రాజెక్టు కింద మొదట బీరంగూడ ప్రైమరీ స్కూల్, శివ్వంపేట జడ్పీహెచ్ఎస్, బొతపల్లి ప్రైమరీ స్కూల్, ఇస్నాపూర్ ప్రైమరీ స్కూల్, నందిగామ ప్రాథమికోన్నత పాఠశాల, తెల్లాపూర్ ప్రైమరీ స్కూల్, సదాశివపేట ప్రైమరీస్కూల్, సంగారెడ్డిలోని ప్రైమరీ బాలికల పాఠశాల, హోతి (బీ) ప్రాథమికోన్నత పాఠశాలలో మొదట సౌర విద్యుత్ యూనిట్లు ప్రారంభించనున్నారు.
నెట్ మీటర్ల ఏర్పాటు ప్రారంభం
పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత సౌర విద్యుత్ యూనిట్లు ప్రారంభించనున్న పది పాఠశాలల్లో నెట్మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఐదు పాఠశాలల్లో నెట్మీటర్లు బిగించారు. జడ్పీహెచ్ఎస్ హన్మంతరావుపేట, జడ్పీహెచ్ఎస్ చాప్టా(కె), నిజాంపేట్ జడ్పీహెచ్ఎస్, నారాయణఖేడ్ బాలికల ఉన్నతపాఠశాల, జడ్పీహెచ్ఎస్ ఇస్నాపూర్లో నెట్మీటర్లు బిగించారు. నెట్మీటర్ల ఏర్పాటుతో ఉత్పత్తి అయిన సౌర విద్యుత్ను వాడుకోవచ్చు. మిగిలిన విద్యుత్ను యూనిట్ల వారీగా విక్రయించేందుకు నెట్మీటర్ ఉపయోగపడుతుంది. నెట్మీటర్ను గ్రిడ్కు అనుసంధానం చేయటం ద్వారా అదనంగా ఉన్న సౌర విద్యుత్ను విక్రయించేందుకు వీలు ఉంటుంది.