ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్న సీఎం కేసీఆర్
కార్పొరేట్కు దీటుగా సర్కారు వైద్యం
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
పటాన్చెరు ఏరియా దవాఖానలో డయాగ్నాస్టిక్ హబ్ ప్రారంభం
హాజరైన జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పటాన్చెరు, మే 11: తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ల్యాబ్లో తిరిగి డయాగ్నాస్టిక్స్ పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరును డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రిదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందజేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో వైద్య పరికరాలను, డయాగ్నాస్టిక్ మిషన్లను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారన్నారు.
పటాచ్చెరు నియోజకవర్గం అనగానే కార్మికులు అధికంగా ఉంటారన్నారు. కార్మికవర్గాలకు నాణ్యమైన వైద్యసేవలు ఉచితంగా అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. బొల్లారం, పటాన్చెరు, పాశమైలారం, సుల్తాన్పూర్, కాజీపల్లివంటి పారిశ్రామికవాడల్లోని కార్మికులకు కూడా ఈ వైద్య పరీక్షలు ఉపయోగపడుతాయన్నారు. పటాన్చెరులో ఏర్పాటు చేసిన డయాగ్నాస్టిక్ కేంద్రం పేదల ప్రజలకు ఓ వరం అని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీఎం కేసీఆర్ ఉచితంగా డయాగ్నాస్టిక్స్ చేయించుకునే సౌకర్యాన్ని ఏరియా దవాఖానాలో పెట్టారన్నారు. త్వరలోనే పటాన్చెరుకు మల్టీస్పెషాలిటీ దవాఖాన రాబోతున్నదన్నారు. 250 పడకల దవాఖానా రాకతో పటాన్చెరు పట్టణంలో అందరికీ ఆరోగ్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో మొదటగా పటాన్చెరులో పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేసిన కలెక్టర్కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, విజయ్కుమార్, షకీల్, శ్రీను, హాషం, దవాఖాన సూపరింటెండెంట్ వసుంధర, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.