గ్రామీణ యువత కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సర్కార్
సంగారెడ్డి జిల్లాలో 421 ఆట స్థలాలకు భూమి కేటాయింపు
274 చోట్ల పనులు షురూ
ఇప్పటివరకు 129 మైదానాల్లో నిర్మాణ పనులు పూర్తి
29 మైదానాలు ప్రారంభం
ఎకరం స్థలంలో రూ.4లక్షలతో ఒక్కో గ్రౌండ్ నిర్మాణం
మైదానం చుట్టూ 1500 మొక్కలతో హరితహారం
యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా వారిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఊరికో క్రీడాప్రాంగణాన్ని నిర్మిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామపంచాయతీల్లో 421 చోట్ల క్రీడా మైదానాల కోసం భూసేకరణ చేశారు. ఇందులో 274 ప్రాంతాల్లో స్థలాలు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో గ్రౌండ్ను ఎకరా స్థలంలో రూ. 4 లక్షలతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 129 ప్రాంగణాల పనులు పూర్తవగా, వీటిల్లో 29 మైదానాలను ఇప్పటికే ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. మరో 100 ప్రాంగణాలను వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రహరీలు నిర్మించి చుట్టూ రెండు వరుసల చొప్పున ఔషధ, పండ్ల మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ మైదానాలను సద్వినియోగం చేసుకుంటే ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.
సంగారెడ్డి, జూన్ 26: యువతలో క్రీడలపై ఆసక్తి ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతులు లేకపోవడంతో నిరుత్సాహంతో ఆటలపై దృష్టి పెట్టడంలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి గ్రామీణ యువతను క్రీడలవైపు ప్రోత్సహించేందుకు మైదానాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పట్టణాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైన క్రీడలు ఇక నుంచి పల్లెల్లోకీ విస్తరించనున్నాయి. ప్రతి గ్రామంలో ఆటల్లో యువత రాణించనున్నారు.
జిల్లాల్లో 274 క్రీడా ప్రాంగణాల పనులు ప్రారంభం
సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లోని 421 గ్రామాల్లో క్రీడా మైదానాలకు భూమిని సేకరించారు. అందులో 274 క్రీడా మైదానాలకు స్థలాలు అనుకూలం గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎకరా స్థలంలో ఒక మైదానం నిర్మించేందుకు అధికారులు గ్రామాల వారీగా స్థలాలు సేకరించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు సకాలంలో పూర్తి చేసేందుకు పనులు వేగంగా చేస్తున్నారు. రూ.4 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో ఒక్కో క్రీడా మైదానం రూపుదిద్దుకుంటున్నది. ఇందులో ఇప్పటివరకు 129 క్రీడా ప్రాంగణాలు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 29 మైదానాలు ప్రారంభించుకుని యువకులు ఆటలపై దృష్టి సారించారు.
మైదానాల చుట్టూ మొక్కల పెంపకం
క్రీడా మైదానం చుట్టూ ప్రహరీ నిర్మించి, హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించనున్నారు. క్రీడా ప్రాంగణం చుట్టూ రెండు వరుసల చొప్పున మొక్కలు నాటనున్నారు. భావితరాలకు ఉపయోగపడేలా ఔషధ మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్ర సంగారెడ్డి మండల పరిధిలోని కులబ్గూర్, హనుమాన్ పంచాయతీల్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి ఈ నెల 13న రిబ్బన్ కట్ చేసి మైదానాలు ప్రారంభించి మొక్కలు నాటారు.
ప్రారంభమైన ఆట స్థలాలు
ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయంతో అధికారులు మైదానాల నిర్మాణ పనులు వేగవంతం చేశారు. యువతలో శారీరక దేహదారుఢ్యం పెంచడానికి గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి 129 కీడ్రా మైదానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 29 ఆట స్థలాలు ప్రారంభమయ్యాయి. మిగతా 100 మైదానాలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అత్యధికంగా జహీరాబాద్లో..
జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 15 మైదానాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పూర్తిచేసుకున్న ప్రాంగణాల్లో రెండు ప్రారంభించారు. మిగతా 13 క్రీడా ప్రాంగణాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కొండాపూర్ మండలంలో 14 క్రీడా మైదానాలు కేటాయించగా, అన్ని రకాల పనులు పూర్తైనా ఇంకా ప్రాంభించలేదు. పటాన్చెరుకు 12 మైదానాలు కేటాయించగా 3 ప్రాంగణాలు, నారాయణఖేడ్ మండలంలో 10కి ఒక క్రీడా ప్రాంగణం ప్రారంభించారు. త్వరలో పూర్తిస్థాయిలో మైదానాలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వరం
గ్రామీణ ప్రాంత యువతను క్రీ డల్లో ప్రోత్సహించేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకుంటున్న ది. ఇందులో భాగంగా పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేసి నిర్మాణ పనులు చేపట్టాం. ప్రభుత్వం జిల్లాకు 428 ఆట మైదానాలు కేటాయించగా అందులో 129 మైదానాలను అన్ని హంగులతో నిర్మించాం. ఇందులో 29 మైదానాలు ప్రారంభమయ్యాయి. మిగతావి ప్రా రంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఆటల్లో రాణిస్తూ ఆసక్తి గల క్రీడాకారులు ఈ మైదానాలను సద్వినియోగం చేసుకోవాలి. – సురేశ్ మోహన్, డీపీఓ, సంగారెడ్డి