ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 6,490 బడుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 900 స్కూళ్లను గుర్తించింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, కస్తూర్బా పాఠశాలల్లో సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి 2, 5, 10 కిలో వాట్ల స్వామర్థ్యం గల సోలార్ పలకలను అమర్చనున్నది. ఒక్కో కిలోవాట్కు రూ.లక్ష ఖర్చు అవుతుండగా, ఇందుకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పనులు రెడ్కోకు అప్పగించడంతో పాటు వచ్చే ఐదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ఒప్పందం చేసుకున్నది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని ఆదేశాలు జారీచేసింది. భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కరెంట్ బిల్లులకు శాశ్వతంగా స్వస్తి చెప్పేలా
కార్యాచరణ రూపొందిస్తున్నది.
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 17: ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగించే విద్యుత్తు బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని విద్యావంతులు చాలాకాలం నుంచి కోరుతున్నారు. విద్యుత్తు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని, వీటిని భరించే స్థితిలో బడులు లేవని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ ఉపకరణాల ద్వారా ప్రభుత్వానికి పంపించే క్రమంలో విద్యుత్తు వినియోగం పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం సోలర్ ప్లాంట్ల వినియోగానికి ప్రాధాన్యమిస్తోంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కసూర్బా పాఠశాలలను గుర్తించి, ముందుగా వీటిలో సౌర విద్యుత్తు పరికరాలు అమర్చనున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,490 పాఠశాలలు ఎంపిక చేశారు. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 900 పాఠశాలలు ఉన్నాయి.
పాఠశాలల అవసరాలను బట్టి 2, 5, 10 కిలో వాట్ల స్వామర్థ్యం గల సోలార్ పలకలు అమర్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. కిలోవాట్కు రూ.లక్ష ఖర్చవుతుందని అంచనా వేసింది. పాఠశాలల వారీగా నిధులు మంజూరు చేశారు. రెడ్కో ద్వారా సౌర పరికరాల ఏర్పాటు పనులు చేపట్టి 5 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు వారికి ఆప్పగించనున్నారు. మైనర్ మరమ్మతులు వస్తే రెడ్కో చేపడుతుంది. సౌర విద్యుత్తు వినియోగంలో పాఠశాల్లో విద్యుత్తు బిల్లులు వంద శాతం తగ్గించేలా తగిన చర్యలు చేపట్టింది. ఎంపికైన పాఠశాలలను సందర్శించి ఎంత సౌర విద్యుత్తు అవసరమో మదింపు చేస్తారు. ఆ మేరకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.