కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నెలల తరబడి నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమంగా భారీ షెడ్లు నిర్మిస్తున్నా అధికారులు అటు వైపు చూడటం లేదు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిన్నారం, మే 8: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని గడ్డపోతారం, అల్లీనగర్, వావిలాల, ఖాజీపల్లి, మాదారం గ్రామాల్లో భారీగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నెలల తరబడి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు నిర్మాణాలపై నిఘా పెట్టడం లేదు. గడ్డపోతారంలోని 79 సర్కేనంబర్లో భారీగా నిర్మాణాలు చేపట్టారు. వీటికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నా నిర్మాణాలు మాత్రం ఆపడం లేదు. వావిలాలలో స్థానికంగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మాదారం, ఖాజీపల్లి గ్రామాల్లో భారీగా షెడ్లు నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం 30 వరకు అక్రమ నిర్మాణాలు, భారీ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఎనిమిది నెలలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. భారీ షెడ్ల నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుండటంతో అధికారులు సైతం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాకుండా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై నిఘా పెడుతున్నాం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న యజమానులకు నోటీసులు ఇస్తున్నాం. అనుమతులు లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటరామయ్య, కమిషనర్, గడ్డపోతారం, సంగారెడ్డి జిల్లా