గజ్వేల్, జూన్ 11: రైతులు సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి రావాలనే ఉద్దేశంతో పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో సాగు చేసే పంటలో దిగుబడి చాలావరకు తగ్గుతుంది. దీంతో భూసారంలో ఎలాంటి ప్రయోజనం లేకుండాపోతున్నది. అధికంగా ఎరువుల వాడకంతో రైతులకు సాగు ఖర్చు పెరగడంతో దిగుబడి తగ్గుతున్నది. వీటన్నింటిని అధిగమించి రైతులు సాగు చేసే పంటల్లో అధిక దిగుబడి వచ్చేలా అధికారులు ఏటా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. అందుకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రూ.81.20 లక్షల వ్యయంతో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో భూసార పరీక్ష కేంద్రం భవనాన్ని నిర్మించింది. దీంతో ఏటా రైతుల పంట పొలాల్లోని మట్టిని సేకరించి భూసార పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. గత నెల 21న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భవనాన్ని ప్రారంభించారు. త్వరలోనే ఇందులో భూసార పరీక్షలు చేసేందుకు వ్యవసాధికారులు సిద్ధమవుతున్నారు.
రూ.81.20 లక్షల వ్యయంతో నిర్మాణం
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం భూసార పరీక్ష కేంద్రాన్ని రూ.81.20 లక్షలతో నిర్మించింది. గతంలో సదుపాయాలు లేకపోవడంతో భూసార మట్టి పరీక్షలను చేయించేందుకు రైతులు అంతగా ఆసక్తిని చూపించలేకపోవడంతో సాగు చేసిన పంటల్లో దిగుబడి తక్కువగా వస్తుండేది. భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతుల పంట పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి భూసారంలోని ఫలితాలను తెలియజేసి పంటల సాగుపై అవగాహన కల్పించే వెసులుబాటు ఉంటుంది.
ఈ కేంద్రంలో సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించనున్నారు. ఇద్దరు వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తారు. జిల్లాలో 24 మండలాల్లో ఏటా సుమారు ఐదున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. రైతుల సాగుచేసిన పంటల్లో తమ ఇష్టానుసారంగా ఎరువుల వాడకంతో నెలలో సారం తగ్గుతుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రంలో మట్టి పరీక్షలు చేసి నేల సారం తెలుసుకొని రైతులు పంటలను సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలతో పంట పొలాల్లోని జింక్, బోరాన్, సల్ఫర్, మాంగనీస్, మెగ్నీషియం వంటి వివిధ రకాల సూక్ష్మ పోషకాలను గుర్తించి నేలల స్వభావాన్ని పూర్తిగా తెలుసుకొని ఎరువుల వాడకంపై రైతులకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది.
మట్టి పరీక్షలతో ప్రయోజనాలు
గజ్వేల్ కేంద్రంలో త్వరలోనే భూసార పరీక్షలు
గజ్వేల్లో నూతనంగా నిర్మించిన భూసార పరీక్ష కేంద్రంలో త్వరలోనే మట్టి పరీక్షలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 15 రోజలు క్రితం ల్యాబ్కు సంబంధించిన సిబ్బంది నియామకం, పరికరాల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్రావు దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సిబ్బంది నియమించి పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గజ్వేల్ పరిధిలోని రైతులకు త్వరలోనే ఈ పరీక్ష కేంద్రం ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. రైతుల సాగు విధానంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో రైతు వేదికలను నిర్మించి అందులో వ్యవసాయ పంటల సాగుపై ఏటా అధికారులతో అవగాహన కల్పిస్తుంది.
– మాదాసు శ్రీనివాస్, చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, గజ్వేల్
పరికరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం…
భూసార పరీక్ష కేంద్రానికి సంబంధించిన పరికరాల కోసం గత నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రాగానే మట్టి పరీక్షలు ప్రారంభించి రైతులకు భూసారంపై అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే గజ్వేల్లోని భూసార కేంద్రానికి ఒక ఏవో, అటెండర్లను నియమించాం. కొద్ది రోజుల్లోనే రైతుల భూముల్లోని మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేసిన తర్వాత రైతులకు నేల సారంపై తెలియజేస్తాం. దాంతో రైతులు సాగు విధానంలో తీసుకొవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉంటారు. దీంతో సాగులో ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడి పొందే అవకాశాలుంటాయి.
-కె.శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, సిద్దిపేట