చేర్యాల, మే 28: దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. కార్మికులు తమ పేరును కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నది.
గుర్తింపు కార్డు పొందితే సరి…
లేబర్ కార్డు ఉండి ప్రమాదానికి గురైనా, మృతిచెందినా పరిహారం అందిస్తున్నది. గుర్తింపు కార్డు కలిగిన వారి ఆడపిల్లల పెండ్లిళ్లు, ప్రసవాలకు ఆర్థిక సాయం అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నది. కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డు పొంది ఉంటే చాలు బీమా సౌకర్యం వర్తింపజేస్తుంది. ఇందులో తాపీ మేస్త్రీలు, పెయింటర్స్, ఇటుక తయారీదారులు, ప్లంబర్లు, టైల్స్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్లు, రాళ్లు కొట్టేవారు ఇలా.. 56 రకాల పనుల చేసేవారు రూ.110 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి రేషన్కార్డు, ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్టు సైజు ఫొటోలను జత చేయాల్సి ఉంటుంది. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్లలోపు వయసున్న కార్మికులందరూ దీనికి అర్హులు. కార్డు పరిమి తి ఐదు సంవత్సరాలు ఉంటుంది. కార్డు తీసుకొని ఉండి 12 నెలల్లో 90 రోజులు తక్కువ కాకుండా భవనం లేదా ఇతర రంగా ల్లో పనిచేసి ఉండాలనే నిబంధన ఉంది.
చేర్యాల ప్రాంత కార్మికులకు ఎమ్మెల్యే ప్రోత్సాహం…
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో చేర్యాల ప్రాంతంలోని కార్మికులకు ఎప్పటికప్పుడు బీమా తదితర వసతులు చేకూరుతున్నాయి. కాగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 6,808మంది కార్మికులున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. చేర్యాల మండలంలో మొత్తం 3083 (1907 పురుషులు, 1176 మహిళలు) కార్మికులుండగా, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 1945 (1189 పురుషులు, 753 మహిళలు), కొమురవెల్లి మండలంలో 1780 మంది (1267 మంది పురుషులు, 513మంది మహిళలు) కార్మికులున్నారు.
లేబర్ కార్డుతో ప్రయోజనాలు…
కార్మిక శాఖ నుంచి లేబర్ కార్డు పొందిన కార్మికులకు ప్రమాద సమయంతోపాటు కుటుంబంలో ఆడబిడ్డ జన్మిస్తే ఆర్థిక సాయం అందుతుంది. మహిళా కార్మికులకు మొదటి కాన్పునకు రూ.30 వేలు, ఇద్దరు కుమార్తెలుంటే ఇద్దరి వివాహాలకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తారు. డెలివరీ సమయంలో రూ.30 వేలు అందించేలా చర్యలు తీసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడి చికిత్స పొందుతున్నట్లయితే మూడు నెలలకు కలిపి రూ.13,500 అందిస్తుంది. పని చేస్తున్న ప్రదేశంలో శాశ్వత అంగవైకల్యం కలిగితే సదరం సర్టిఫికెట్లో నమోదైన వైకల్య శాతం ప్రకారం పరిహారం లభిస్తుంది. కార్మికులు సహజ మరణం పొందితే వారి నామినీకి దహన సంస్కారాలతో కలిపి రూ.లక్షా 30 వేలు, రోడ్డు, ఇతర ప్రమాదాల్లో మరణిస్తే దహన సంస్కారాలతో కలిసి రూ.6 లక్షల 30 వేలు తెలంగాణ సర్కారు చెల్లిస్తున్నది. ప్రమాదాల్లో అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలను అందజేస్తున్నది.
అండగా బీఆర్ఎస్ కార్మిక విభాగం…
లేబర్ కార్డుతో కలిగే ప్రయోజనాలపై జిల్లా కార్మిక శాఖ అధికారులు, సిబ్బందితో పాటు బీఆర్ఎస్ కార్మిక విభాగం గ్రామగ్రామాల్లో మండల కేంద్రాల్లో ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పథకంలో అర్హులంతా చేరాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముస్త్యాల గణేశ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.
కార్మికులకు అండగా సీఎం కేసీఆర్…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కార్మిక కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళా కార్మికులకు వివాహ కానుక రూ.5 వేలు వచ్చేవి. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇప్పుడు కేసీఆర్ రూ.30 వేలు ఇస్తున్నారు. ప్రసూతి ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు వచ్చేవి. అదే సీఎం కేసీఆర్ ప్రసూతి ఖర్చులను రూ.30 వేలు ఇస్తున్నారు. ప్రమాద బీమా గతంలో రూ.30 వేల నుంచి రూ.80 వేలు వచ్చేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తున్నది. సహజ మరణం పొందితే గతంలో రూ.60 వేలు వచ్చేవి ఇప్పుడు రూ.లక్షా 30 వేలు వస్తున్నాయి. అప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.6 లక్షల 30 వేలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్మికులకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నది. సీఎం చేస్తున్న మంచి పనులను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నాం.
– ముస్త్యాల గణేశ్, జిల్లా కార్యదర్శి, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్