పల్లెల్లో పశుసంపద, పాలసేకరణ పెంపునకు విశేష కృషి చేస్తున్న గోపాల మిత్రలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం మరోసారి అండగా నిలబడింది. వారికిచ్చే గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లే వేతనం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2001లో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పద్ధతిలో గోపాలమిత్రల నియామకం జరిగింది. తెలంగాణ రాక ముందు అప్పటి ప్రభుత్వం కేవలం రూ. 3,500 చెల్లించగా, సీఎం కేసీఆర్ వారి వేతనాన్ని ఏకంగా రూ.8500కి పెంచారు. ప్రస్తుతం మరోసారి పీఆర్సీని పెంచడంతో మొత్తం రూ.11,050లకు చేరుకున్నది. ప్రభుత్వ నిర్ణయంతో మెదక్ జిల్లాలో 52, సంగారెడ్డి జిల్లాలో 43 మంది లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ వర్తింపజేసిన సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారు పేర్కొంటున్నారు.
మెదక్/ సంగారెడ్డి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉండి పాడిపశువులకు చికిత్సలు చేయడ, పశు సంపదను వృద్ధి చేయడంలో గోపాల మిత్రలది కీలకపాత్ర. వారి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను పెంచుతూ తీపికబురును అందించింది. ప్రస్తుతం ఉన్న పారితోషికానికి అదనంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30 శాతం పీఆర్సీ పెంచగా, గోపాలమిత్రులకు కూడా అదేవిధంగా అందజేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మెదక్ జిల్లాలో 52, సంగారెడ్డి జిల్లాలో 43 మంది గోపాలమిత్రలకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
95 మంది గోపాలమిత్రలకు లబ్ధి..
మెదక్ జిల్లాలో 52 మంది, సంగారెడ్డి జిల్లాలో 43 మంది గోపాలమిత్రలు విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గోపాలమిత్రలకు రూ.3,500 పారితోషికాన్ని మాత్రమే అందించేవారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గోపాలమిత్రలకు రూ.8,5000 చెల్లిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30శాతం పీఆర్సీ చెల్లించనుండడంతో రూ.2,550 కలుపుకొని మొత్తం రూ.11,050కు పెరగనున్నది. దీంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 95 మంది గోపాలమిత్రులకు లబ్ధి చేకూరనున్నది.
కృత్రిమ గర్భధారణలు..
జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద గోపాలమిత్రలు పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహిస్తున్నారు. అంతేకాదు విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమంలో కూడా గోపాలమిత్రలు పాడి రైతులతో నేరుగా సంప్రదించి చేసిన కృషి ఫలితంగా పాల సేకరణ పెరిగిందని చెప్పవచ్చు. గోపాలమిత్రల నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించే విధంగా ప్రతి ఆరు నెలలకోసారి వెటర్నరీ యూనివర్సీటీకి చెందిన నిపుణుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
2001లో నియామకం..
గ్రామీణ ప్రాంతాల్లో మేలుజాతి రకం పశు సంపదను పెంచడమే లక్ష్యంగా పశుసంవర్థకశాఖ పర్యవేక్షణలో పశుగణాభివృద్ధి సంఘం ఏర్పాటైంది. పశుగణాభివృద్ధి సంస్థ గ్రామాల్లోని జాతి పశువులకు కృత్రిమగర్భదారణ చేసి మేలుజాతి సంతతి పెరిగేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 2001లో గోపాలమిత్రల నియామకం చేపట్టగా, అప్పటి నుంచి వారు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా గ్రామాల్లో పర్యటిస్తూ పశు సంతతి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. 2007 నుంచి గోపాలమిత్రలకు రూ.1,200 గౌరవ వేతనం ప్రారంభం కాగా, 2010 అక్టోబర్ నుంచి రూ.2 వేలకు పెంచారు. ఆతర్వాత 2011లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రల వేతనం రూ.3,500కు పెంచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వారి వేతనాన్ని ఏకంగా రూ.8500కు పెంచారు. ప్రస్తుతం ఉన్న వారి వేతనాన్ని రూ.11,050 పెంచి వారిలో ఆనందాన్ని నింపారు. ఇదిలా ఉండగా, త్వరలోనే మరింత మంది గోపాల మిత్రల నియామకం చేపట్టనున్నట్లు సమాచారం.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
గోపాలమిత్రలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోపాలమిత్రలకు న్యాయం జరుగుతుంది. గతంలో చాలీచాలని పారితోషికాన్ని మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ 30శాతం పీఆర్సీని పెంచి రూ.11,050లకు పెంచారు.
– రామస్వామి, గోపామిత్రల సంఘం అధ్యక్షుడు, మెదక్
చాలా సంతోషంగా ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా 30శాతం పీఆర్సీ ప్రకటించింది. దీంతో గతంలో ఉన్న దానికన్నా ఎక్కువగా వస్తుంది. ప్రతీ రోజు గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి వారికి సంబంధించిన పశువులకు చికిత్సలు అందిస్తున్నాం. కృత్రిమ గర్భధారణలో కీలక పాత్ర పోషిస్తున్నాం. సీఎం కేసీఆర్ గోపాలమిత్రలకు పారితోషకాన్ని పెంచడం చాలా సంతోషంగా ఉంది.
– శేఖర్, గోపాలమిత్రల సంఘం ఉపాధ్యక్షుడు, మెదక్