రేపు రేక్ పాయింట్ ప్రారంభం
గజ్వేల్ రైల్వే స్టేషన్లో ముమ్మరంగా ఏర్పాట్లు
ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
గజ్వేల్, జూన్ 20 : గజ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్లాట్ఫాం కూడా సిద్ధంగా ఉంది. అయితే ఫ్లాట్ఫాంపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, ఇతర విద్యుత్ దీపాల స్తంభాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా జరిగేలా చేశారు. స్టేషన్లో విద్యుత్దీపాలు, ఫ్యాన్లు బిగిస్తున్నారు. మంత్రి హరీశ్రావుతో పాటు ఇతర మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు, మార్కెటింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
రేపు(బుధవారం) రేక్ పాయింట్ ప్రారంభం కానుండడంతో రైల్వే స్టేషన్ పరిసరాలలో నిర్మాణంలో భాగంగా పేరుకుపోయిన రాళ్లు, చెత్త, పిచ్చిమొక్కలను కార్మికులతో అధికారులు శుభ్రం చేయించారు. అలాగే సిగ్నల్స్వ్యవస్థ, తదితర అంశాలను మరోసారి పరిశీలిస్తున్నారు.