ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు
ప్రతి వ్యక్తికి 5 కిలోలు
సంగారెడ్డి జిల్లాలో 3,80,175 రేషన్ కార్డులు
845 దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్న ప్రభుత్వం
జిల్లాకు 6274.440 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు
12,54,888 మందికి లబ్ధి..
నేటి నుంచి 26వ తేదీ వరకు ఆహార భద్రత లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు కిలోల ఉచిత బియ్యం అందించనున్నది. సంగారెడ్డి జిల్లాలో 845 రేషన్ దుకాణాలుండగా, 3,80,175 కార్డులు.. 12,54,888 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 6274.440 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లాకు కేటాయించిన బియ్యం ఇప్పటికే గోదాములకు చేరగా, పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం డీలర్లకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని , జిల్లాలోని అంతోద్యయ, ఫుడ్ సెక్యూరిటీ, అన్నపూర్ణ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. కరోనా కాలంలోనూ పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చి అండగా నిలబడిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు సాయం చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి, జూన్ 17 : ప్రభుత్వం ప్రతి నెలా ఆహార భద్రత కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ దుకాణాల్లో బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. గత కరోనా కాలంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఉచిత బియ్యాన్ని అందించింది. మరోసారి ప్రజలు కడుపునిండా భోజనానికి ఇబ్బందులు పడొద్దని ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా ఈ నెల 18 నుంచి బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా, ఉచితంగా 5 కిలోల చొప్పున 3,80,175 కార్డుదారులకు 6274.440 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయనున్నారు. జూన్ మాసానికి సంబంధించిన రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ప్రతినెలా వారీగా కోట ప్రకారం పంపిణీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి జిల్లా అధికారులకు ఉచితంగా కేటాయించిన బియ్యాన్ని సరఫరా చేసింది. ప్రభుత్వం కేటాయించిన బియ్యం జిల్లా చేరుకొని పంపిణీకి సిద్ధ్దంగా ఉన్నాయి.
జిల్లాకు కేటాయించిన బియ్యాన్ని జిల్లాలోని 845 రేషన్ దుకాణాల్లో ఆహార భద్రత కార్డు లబ్ధ్దిదారులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆహార భద్రత కార్డుల్లో నమోదైన లబ్ధ్దిదారులు 12,54,888 మంది ప్రజలు ఉచితంగా బియ్యం పొందనున్నారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ఉచిత బియ్యం ఇప్పటికే గోదాంల్లో నిల్వ ఉన్నాయి. నేటి నుంచి రేషన్ దుకాణాల్లో కార్డుదారులకు ఉచితంగా 5 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. ఈ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని 9 రోజుల్లో పూర్తిచేసేందుకు పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రతి యూనిట్కు 5 కిలోలు
సంగారెడ్డి జిల్లాలోని 845 రేషన్ దుకాణాల్లో 3,80,175 ఆహార భద్రత కార్డుల్లో నమోదైన 12,54, 888 మంది లబ్ధ్దిదారులు ఉచిత బియ్యం పొందనున్నారు. ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున రేషన్ డిలర్ల వద్ద బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా రేషన్ దుకాణాల్లో కిలో రూపాయికి కార్డులో ఎంత మంది ఉంటే అంత మందికి బియ్యం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాలోని అంతోద్యయ, ఫుడ్ సెక్యూరిటీ, అన్నపూర్ణ కార్డులతో ప్రతినెలా బియ్యం పొందుతున్నారు. ప్రజలు కడుపునిండా భోజనానికి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రేషన్ కార్డులపై బియ్యం పంపిణీకి సిద్ధ్దమైంది. దీంతో జిల్లాలోని ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు. నేడు అధికారికంగా జిల్లాలోని రేషన్ దుకాణాల్లో జూన్ నెలకు సంబంధించిన అదనపు ఉచిత బియ్యం పొందనున్నారు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నది. ఈ అవకాశాన్ని ఆహార భద్రత కార్డుదారులు వినియోగించుకోవాలి. ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు సరఫరా చేయనున్నాం. ఫుడ్ సెక్యూరిటీ, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులు ప్రతి వ్యక్తి 5 కిలోల బియ్యం పొందాలి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. లబ్ధ్దిదారులు ఈ విషయాన్ని గమనించాలి. నేటి నుంచి సరఫరా చేయనున్న ఉచిత బియ్యం పంపిణీకి జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. రేషన్ దుకాణాల డీలర్లు డబ్బులు అడిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలని లబ్ధిదారులకు సూచించాం.
– రాధికా రమణి, ఇన్చార్జి పౌరసరఫరాల అధికారి