సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలబడిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ వారిపాలిట దేవుడిలా మారాడు. ఐదు సంవత్సరాలుగా నాణ్యమైన కరెంట్ను అందిస్తుండడంతో ఏటా యాసంగి, వానకాలం సీజన్లలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 99,616 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, 2.95 మిలియన్ల యూనిట్లను వినియోగిస్తున్నారు. ఎక్కడా విద్యుత్ సమస్యలు రాకుండా అవసరమైన చోట ప్రభుత్వం కొత్తగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నది. బోరుబావులు, బావులు ఉన్న రైతులు వరి, చెరుకు, కూరగాయలు ఇతర సాగునీటి ఆధారిత పంటలు వేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేక పంటలు ఎండిపోయి, అప్పుల భారం పెరిగి ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో పుష్కలంగా నీళ్లు, నిరంతర కరెంట్ సరఫరాతో సాగు సంబురంగా మారిందని రైతులోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
సంగారెడ్డి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలతో రైతులు విలవిల్లాడారు. అప్పటి ప్రభుత్వాలు సాగుకు కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో రైతులు అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ఆవిర్భావం, సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన అనంతరం విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 24గంటల విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం రైతుల తలరాతను మార్చేసింది. 2018 జనవరి 1 నుంచి సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రారంభించారు. ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభమై ఇప్పటి వరకు ఐదేండ్లు పూర్తయ్యాయి. ఉచిత విద్యుత్ సరఫరాతో సంగారెడ్డి జిల్లాలో పంటల సాగు పెరిగింది. 24గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా అవుతుండటంతో రైతులు బోరుబావులు, బావుల కింద వివిధ రకాల పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నిరంతరాయంగా కరెంటు సరఫరా అవుతుండంతో పంటల దిగుబడి పెరిగి రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారు.
జిల్లాలో 99,616 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సరఫరాతో సంగారెడ్డి జిల్లాలో 99,616 మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. జిల్లాలో మొత్తం 30 శాతానికి పైగా వ్యవసాయ అవసరాలకు కరెంటు సరఫరా జరుగుతున్నది. ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభమైన 2018-19లో జిల్లాలో మొత్తం 89,286 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2.96 మిలియన్ యూనిట్ల విద్యుత్ను రైతులు సాగు అవసరాలకు ఉపయోగించేవారు. 2019-20లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 90,246కు పెరుగగా, 2.91 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉపయోగించారు. 2020-21లో 93,555 కనెక్షన్లకు పెరుగగా, 2.87 మిలియన్ యూనిట్ల కరెంటును సాగుకు వినియోగించారు. 2021-22లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది. ఆ సంవత్సరంలో 97,656 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2.94 మిలియన్ యూనిట్ల కరెంటును వాడారు. 2022-23లో వ్యవసాయ విద్యుత్కనెక్షన్ల సంఖ్య 99,616కు చేరి, 2.95 మిలియన్యూనిట్లు విద్యుత్ ఉపయోగిస్తున్నారని అధికా రుల లెక్కలు చెబుతున్నాయి. నాణ్యమైన, ఉచిత విద్యుత్ సరఫరాతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గతంలో వానకాలంలో వేసే పంటలు 50 నుంచి 60వేల ఎకరాల్లో ఉండగా, ఉచిత విద్యుత్తో సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలకు చేరుకున్నది. యాసంగిలో సైతం జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. బోరుబావుల కింది రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసి లబ్ధి పొందుతున్నారు.