శివ్వంపేట, ఏప్రిల్ 28: ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు చేయకపోతే సీఎం రేవంత్రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం శివ్వంపేటలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హరీశ్రావు భారీ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే మోసపోయామన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మళ్లీ ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారని, రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్కు ఓట్ల రూపంలో తరుగు తీయాలని రైతులను కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నతాధికారిగా ప్రజలకు సేవ చేశారని,
అతన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓట్లు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని హరీశ్రావు తెలిపారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గోవిందా అనే పాటపాడి అందరినీ ఆకట్టుకున్నారు. అంతకుముందు జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో, ముస్లిములు పీర్ల ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.