మనం ప్రతిరోజూ ఎన్నో విషయాలు చూస్తుంటాం. కానీ, నిజంగా గమనిస్తున్నామా? పక్షుల కిలకిలారావాలు వింటున్నామా? పూల పరిమళాన్ని ఆస్వాదిస్తున్నామా? గాలి స్పర్శను అనుభవిస్తున్నామా?… ఓ సారి ఆలోచిస్తే వేగంగా మారుతున్న జీవనశైలిలో ఈ చిన్న అనుభూతులన్నీ కనుమరుగైపోతున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘ఐదు ఇంద్రియాల అభ్యాసానికి’ ఆదరణ పెరుగుతున్నది. ఈ పద్ధతి చాలా సరళమైనది. రోజులో ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు.
ముందుగా మీ చుట్టూ కనిపిస్తున్న ఐదు వస్తువులను ప్రశాంతంగా గమనించండి. ఆ తర్వాత చేతితో తాకగల నాలుగు వస్తువుల స్పర్శను అనుభవించండి. తరువాత మూడు శబ్దాలను గుర్తించండి. రెండు పరిమళాలను ఆస్వాదించండి. చివరగా ఒక రుచిని ఆస్వాదిస్తూ దానిపై దృష్టి నిలపండి. ఈ క్రమం మన దృష్టిని గత జ్ఞాపకాల నుంచి, భవిష్యత్తు ఆందోళనల నుంచి తీసుకొచ్చి ప్రస్తుతం జరుగుతున్న అనుభవంపై నిలబెడుతుంది. ప్రత్యేకంగా కార్యాలయాల్లో ఎకువసేపు కంప్యూటర్ ముందు పనిచేసేవారు, నిరంతరం మొబైల్ వినియోగించే వారు, రోజంతా ఒత్తిడితో ఉండేవారు ఈ అభ్యాసాన్ని తమ దినచర్యలో చేర్చుకుంటున్నారు.
దీనికి ప్రత్యేక పరికరాలు, ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. పారులో కూర్చున్నా, ఇంటి బాలనీలో ఉన్నా, కార్యాలయంలో చిన్న విరామం దొరికినా చేయవచ్చు. ఈ ప్రక్రియ ఉద్దేశం సమస్యలను మాయం చేయడం కాదు. మనసు కుదురుగా ఉండనప్పుడు దానిని మళ్లీ ప్రస్తుత క్షణంలో నిలబెట్టడం. అందుకే దీనిని మానసిక విరామంగా కూడా చాలామంది అభివర్ణిస్తున్నారు. చిన్నపిల్లలు ప్రకృతిని ఆసక్తిగా గమనించినట్లు, మనమూ కాసేపు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఐదు ఇంద్రియాలతో ఆస్వాదించాలనే ఆలోచనే ఈ పద్ధతి వెనుక ఉంది.