Amit Shah : కర్ణాటక (Karnataka) లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) శనివారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో హుబ్బళ్లి (Hubballi) లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన హోటల్కే పరిమితమయ్యారు. అరోగ్యంగా ఉంటే హుబ్బళ్లిలోని కేఎల్ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసవిర్మఠ్ మెడికల్ కాలేజీ నూతన భవనాన్ని, 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ను అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది.
రూ.700 కోట్ల వ్యయంతో ఈ మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమం నిమిత్తం షెడ్యూల్ ప్రకారమే శుక్రవారం రాత్రి అమిత్ షా హుబ్బళ్లి చేరుకుని ఒక హోటల్లో బస చేశారు. అయితే శనివారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అమిత్ షా గైర్హాజరీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అనారోగ్య కారణాలవల్లే అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని కేఎల్ఈ సొసైటీ ఛైర్మన్ ప్రభాకర్ కోరే స్పష్టంచేశారు.