– ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన సర్కార్
– సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
జూలూరుపాడు, సెప్టెంబర్ 19 : ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో గార్లపాటి వెంకటి అధ్యక్షతన శనివారం జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అనేక రకాల సాకులు చూపుతూ ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను గాలికి వదిలేశాయని విమర్శించారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్న ప్రభుత్వాలు, కనీస సమస్యలను పరిష్కరించకపోగా ప్రజలను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం అత్యల్పంగా నమోదైందని, దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో పంటలు పండే అవకాశం తక్కువగా ఉందని, తక్షణమే ప్రభుత్వం అప్రమత్తమై రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి యాస నరేష్, జిల్లా కమిటీ సభ్యుడు భూక్యా రమేష్, మండల కమిటీ సభ్యులు బానోత్ ఈశ్వర్, బానోత్ మధు, వి. చందర్ రావు, జల్లిక రాధాకృష్ణ, మాలోత్ రాముల, తాటి పద్మ, ధరావత్ వేణు, కోటేశ్వరరావు, రెడ్డిబోయిన గోవిందు పాల్గొన్నారు.