Gurugram : హరియాణాలోని గురుగ్రామ్లో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని చంపిన జంట.. హత్యపై అనుమానం రాకుండా ఉండేందుకు అతడి ఫోన్ నుంచే కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయారు ఇద్దరూ. ఈ ఘటన ఇటీవల జరిగింది. ఢిల్లీకి చెందిన యువరాజ్ సింగ్ మంచందా అనే యువకుడు సెప్టెంబర్ 6న సాయంత్రం తన స్నేహితురాలైన ఒక మహిళను కలవడానికి వెళ్లాడు. ఈ విషయం తన చెల్లెళ్లు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు.
అయితే, స్నేహితుల్ని కలవడానికి వెళ్లిన యువరాజ్ నాలుగు రోజులైనా తిరిగిరాకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ జరపగా అతడు హత్యకు గురైన విషయం బయటపడింది. ఘటన జరిగిన రోజు సాయంత్రం యువరాజ్ తన పెళ్లి కోసం షాపింగ్ చేశాడు. అతడి పెళ్లి వచ్చే నెలలో జరగాల్సి ఉంది. షాపింగ్ అనంతరం సాయంత్రం తన స్నేహితురాలు అన్య వాత్స్, ఆమె భర్త సన్యం సచ్దేవను కలిసేందుకు వెళ్లాడు. తను ఒక చోట కార్ పార్క్ చేశాడు. అనంతరం అన్య, ఆమె భర్త వచ్చిన కారులో వారితో కలిసి వెళ్లాడు. ఈ సమయంలో కారును అన్య భర్త సచ్దేవ డ్రైవ్ చేశాడు. ఆ పక్క సీట్లో యువరాజ్ కూర్చున్నాడు.
అన్య వెనుక సీట్లో కూర్చుంది. కారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత అన్య తన గన్ తీసి, యువరాజ్ను కాల్చేసింది. దీంతో అతడు కారు సీట్లోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. తర్వాత కొంతదూరం వెళ్లి అతడి మృతదేహాన్ని దగ్గరలో ఉన్న ఒక మురికి కాలువలో పడేశారు. తర్వాత అతడి ఫోన్ తీసుకున్నారు. సెప్టెంబర్ 6న ఈ హత్య జరిగింది. అనంతరం రెండు రోజులపాటు అతడు ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు కంగారు పడిపోయారు. సెప్టెంబర్ 8న ఆ హంతక జంట యువరాజ్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ చేశారు. తాను బాగానే ఉన్నానని, శనివారం తిరిగిస్తానని మెసేజ్ చేశారు. తర్వాత మళ్లీ గురువారం వస్తానని ఇంకో మెసేజ్ చేశారు.
అయితే, ఇదంతా జరుగుతున్న తీరుపై యువరాజ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సెప్టెంబర్ 10న గురుగ్రామ్ పోలీసులకు ఒక మృతదేహం మురికి కాలువలో లభ్యమైంది. నాలుగు రోజులైనా మృతదేహం ఎవరిదో తెలియకపోవడంతో పోలీసులే.. ఆ మృదేహాన్ని ఖననం చేశారు. అనంతరం సెప్టెంబర్ 16న ఈ విషయం గురించి పోలీసులు యువరాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తాము యువరాజ్ కనిపించట్లేదు అని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరిగ్గా స్పందించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.
మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత మరో చోట దొరికిన మృదేహం గురించి ఇతర పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. తమకు తెలియకుండా అతడి మృతదేహాన్ని ఖననం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో విచారణ జరిపిన పోలీసులు హత్యకు పాల్పడిన జంటను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్కు, ఆ జంటకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది.