జగదేవ్పూర్ ఏప్రిల్ 29: కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మండల నాయకులతో కలసి మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. నాలుగు నెలల పాలనలో రుణమాఫీ, రైతుబంధు, రూ.నాలుగు వేల పింఛన్, మహాలక్ష్మి కింద రూ.2500 ఇవ్వకుండా కేసీఆర్ తెచ్చిన అనేక పథకాలను ఎత్తేశారని విమర్శించారు. రేవంత్రెడ్డి అయితే కేసీఆర్ను తిట్టడం లేకపోతే దేవుడి మీద ఒట్లు వేయడం తప్ప, ఒక్క పని చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్ గౌరవం పెంచింది కేసీఆర్ కాదా అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.743 కోట్ల గడా నిధులు, రూ.45 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు వెనక్కి తీసుకున్నారని హరీశ్రావు అన్నారు.
రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తావా.. లేక రాజీనామా చేస్తావా అంటే రేవంత్రెడ్డి పారిపోయిండని ఎద్దేవా చేశాడు. ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ నాయకులను నమ్మి మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసిందేమి లేదన్నారు. వెంకట్రామిరెడ్డి మంచి వ్యక్తి అని, ప్రజలకు సేవచేసే గుణం ఉన్నదని, ఆయనను గెలిపిస్తే గజ్వేల్ మరింత అభివృద్ధి చెందుతుందని హరీశ్రావు పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డిని గెలిపించి బలాన్నివ్వండి.. పేగులు తెగేదాకా కొట్లాడుతానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు ఇచ్చేదాకా అసెంబ్లీలో కొట్లాడి, రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్లు శ్రీనివాస్రెడ్డి, ఉపేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జగదేవ్పూర్ ఎంపీటీసీ కవిత, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, సీనియర్ నాయకులు యాదవరెడ్డి, సుధాకర్రెడ్డి, కనకయ్య, నాగరాజు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.